'పో.. వెళ్లి బౌలింగ్‌ చేయ్‌ బ్రో'

19 May, 2021 20:05 IST|Sakshi

ముంబై: టీమిండియా కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిలో కోపం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఏ విషయమైనా సరే తన కూల్‌ కెప్టెన్సీతో అక్కడి పరిస్థితినే మార్చేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌ సహా ఐపీఎల్‌లోనూ ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. మరి అలాంటి ధోని టీమిండియా వివాదాస్పద బౌలర్‌ ఎస్‌. శ్రీశాంత్‌కి  ఒక సందర్భంలో వార్నింగ్‌ ఇచ్చాడంటూ మరో భారత క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప పేర్కొన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఇది చోటు చేసుకుందని తెలిపాడు. స్టాండప్ కమేడియన్ సౌరభ్ పంత్‌ యూట్యూబ్‌ చానెల్‌కు ఊతప్ప ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోని, శ్రీశాంత్‌ల మధ్య జరిగిన ఘటనను ప్రస్తావించాడు. 

''టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో హైదరాబాద్ వేదికగా ఓ టీ20 మ్యాచ్ ఆడుతున్నాం. ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ ఆండ్రూ సైమండ్స్ లేదా హస్సీనా అనేది నాకు సరిగా గుర్తు లేదు. కానీ.. శ్రీశాంత్ విసిరిన బంతిని అతనికే డైరెక్ట్‌గా హిట్ చేశాడు. వెంటనే బంతిని అందుకున్న శ్రీశాంత్ బెయిల్స్‌ని ఎగరగొట్టి.. హౌ ఈజ్ దట్..? హౌ ఈజ్ దట్..? అంటూ గట్టిగా అరిచాడు. దాంతో.. అతని వద్దకి పరుగెత్తుకుంటూ వెళ్లిన ధోని కోపంతో శ్రీశాంత్‌ను పక్కకు తోసి 'వెళ్లి బౌలింగ్ చెయ్ బ్రో' అంటూ హెచ్చరించాడు.  స్వతహగా చాలా దూకుడుగా ఉండే శ్రీశాంత్‌ని కూడా ధోని చక్కగా హ్యాండిల్‌ చేయడం తాను ఎప్పటికీ మరిచిపోను. అందుకే కూల్‌ మాస్టర్‌ అనే పేరు ధోనీకి సరిగ్గా సరిపోతుంది'' అని ఉతప్ప వెల్లడించాడు.

కాగా ఐపీఎల్ 2013లో స్ఫాట్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో శ్రీశాంత్ ఏడేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. అయితే.. ఈ ఏడాది ఐపీఎల్‌లో మళ్లీ ఆడేందుకు ఈ పేసర్ ప్రయత్నించగా.. ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఈ ఏడాది వచ్చిన రాబిన్ ఉతప్పకి కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ధోనీ కల్పించలేదు. ఇక సీఎస్‌కే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో దుమ్మురేపింది. యూఏఈలో గతేడాది జరిగిన ఐపీఎల్‌ సీజన్‌ను మరిపిస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. 2 ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.  
చదవండి: వార్నర్‌ మళ్లీ మొదలుపెట్టాడు.. ఈసారి రౌడీ బేబీతో

>
మరిన్ని వార్తలు