Roger Federer: ఒకే ఫ్రేమ్‌లో ఆ 'నలుగురు'.. షేక్‌ అవుతున్న ఇంటర్నెట్‌

23 Sep, 2022 11:06 IST|Sakshi

ప్రస్తుతం టెన్నిస్‌ అభిమానుల కళ్లన్నీ స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఆడనున్న లావెర్‌ కప్‌పై నెలకొన్నాయి.  తన చిరకాల మిత్రుడు రఫేల్‌ నాదల్‌తో కలిసి ఫెదరర్‌ డబుల్స్‌ మ్యాచ్‌ ఆడనున్నాడు. నాదల్‌, ఫెదరర్‌ ప్రత్యర్థులుగా ఆఖరి మ్యాచ్‌ ఆడాలని అభిమానులు కోరుకుంటే.. వాళ్లు మాత్రం కలిసి డబుల్స్‌ మ్యాచ్‌ ఆడనున్నారు. ఇది కొంతవరకు ఉపశమనమే. ఎందుకంటే ఒకేసారి ఇద్దరి ఆటను.. వారి షాట్లను చూస్తాం కాబట్టి.

ఇదిలా ఉంటే.. ఫెదరర్‌ గురువారం రాత్రి తన ట్విటర్‌లో షేర్‌ చేసిన ఒక ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు సమకాలీన  ఆటగాళ్లైన రఫేల్‌ నాదల్‌, నొవాక్‌ జొకోవిచ్‌, ఆండీ ముర్రేలు ఒక ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు. ఫెదరర్‌ ఆఖరి మ్యాచ్‌ ఆడనున్న నేపథ్యంలో ఈ నలుగురు గురువారం రాత్రి హోటల్‌లో డిన్నర్‌ చేశారు. ఆ తర్వాత లండన్‌లోని థేమ్స్‌ బ్రిడ్జి వద్ద ఫోటో దిగారు. ఇదే ఫోటోను ఫెదరర్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ .. మిత్రులతో కలిసి డిన్నర్‌కు వెళ్తున్నా అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. టెన్నిస్‌ దిగ్గజాలుగా పేరు పొందిన ఈ నలుగురు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి చాలా కాలమైంది. అందుకే ఫెదరర్‌ పెట్టిన ఫోటోకు లైక్స్‌ వర్షం కురిసింది. దాదాపు 4లక్షలకు పైగా లైక్స్‌ రాగా.. 40వేల రీట్వీట్స్‌ వచ్చాయి. 

ఫెదరర్‌, నాదల్‌, జొకోవిచ్‌, ఆండీ ముర్రే.. ఆటలో ఎవరి శైలి వారిదే. ఈ నలుగురు దిగ్గజాలు కలిసి 66 గ్రాండ్‌ స్లామ్‌లు కొల్లగొట్టారు. అందులో నాదల్‌(22), జొకోవిచ్‌(21), ఫెదరర్‌(20), ముర్రే(3) గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. నాదల్‌, జొకోవిచ్‌, ఫెదరర్‌ల హవాలో ముర్రే అంతగా వెలుగులోకి రాకపోయినప్పటికి.. వీరితో సమకాలీకుడిగా పేరు పొందడం విశేషం. ఇక నాదల్‌- ఫెదరర్‌లు ఇంతకముందు 2017లో లావెర్‌ కప్‌లో డబుల్స్‌ మ్యాచ్‌ను కలిసి ఆడారు. తాజాగా ఫెదరర్‌కు చివరి టోర్నీ కావడంతో అతనితో కలిసి ఆడాలని నాదల్‌ నిశ్చయించుకున్నాడు.

చదవండి: చివరి మ్యాచ్‌ మాత్రమే.. అంతిమయాత్రలా చేయకండి

Road Safety World Series 2022: సచిన్‌ క్లాస్‌..యువీ మాస్‌; ఇండియా లెజెండ్స్‌ ఘన విజయం

మరిన్ని వార్తలు