Rohit Sharma: రంగంలోకి దిగిన హిట్‌మ్యాన్‌.. ఇంగ్లండ్‌తో పరిమత ఓవర్ల సిరీస్‌కు రెడీ..!

4 Jul, 2022 13:14 IST|Sakshi

ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. ఎనిమిది రోజుల ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్.. కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు రాగానే ప్రాక్టీస్‌ సైతం మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు తాను రెడీ అంటూ అభిమానులకు సంకేతాలు పంపాడు. ఆదివారం  క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన హిట్ మ్యాన్.. నెట్స్‌లో చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. భారీ షాట్లు కాకుండా డిఫెన్స్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించిన రోహిత్‌.. నెట్స్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఈ వీడియోను చూసిన హిట్‌మ్యాన్‌ అభిమానులు.. ఇక ఇంగ్లీషోల్లకు దబిడిదిబిడే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, రోహిత్‌ శర్మకు కరోనా నెగిటివ్‌ రిపోర్డు వచ్చినప్పటికీ మరో పరీక్షకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. హిట్‌మ్యాన్‌కు ఇవాళ (జులై 4) గండె రక్తనాళాలకు సంబంధించిన పరీక్ష చేయాల్సి ఉందని.. ఆ రిపోర్టు ఆధారంగానే అతను తొలి టీ20కి అందుబాటులో ఉంటాడా.. లేదా..? అన్న విషయంపై క్లారిటీ వస్తుందని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. రోహిత్‌కు ఈ టెస్ట్‌లో నార్మల్‌ రిపోర్ట్ వచ్చినా మళ్లీ ఫిట్‌నెస్‌ పరీక్షను సైతం ఎదుర్కొనాల్సి ఉంటుంది. కరోనా నిబంధనల ప్రకారం హిట్‌మ్యాన్‌ ఈ ప్రొసీజర్‌ మొత్తాన్ని క్లియర్‌ చేస్తేనే తొలి టీ20కి అందుబాటులో ఉంటాడు. కాగా, జులై 7 నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య పరిమిత​ ఓవర్ల సిరీస్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో మూడు టీ20లు, మూడు వన్డేలు జరగాల్సి ఉన్నాయి.
చదవండి: భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా
 

మరిన్ని వార్తలు