సిరాజ్‌ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు: రోహిత్‌ శర్మ

16 Jan, 2023 11:52 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌ సన్నాహాకాల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా ఘనంగా ముగించింది. తిరువంతపురం వేదికగా ఆదివారం లంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్‌.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆఖరి వన్డే విజయంలో భారత ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, గిల్‌, సిరాజ్‌ కీలక పాత్ర పోషించారు.

తొలుత బ్యాటింగ్‌లో కోహ్లి, గిల్‌ సెంచరీలతో చెలరేగగా.. అనంతరం బౌలింగ్‌లో సిరాజ్‌ లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో సిరాజ్‌ 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా సిరాజ్‌ తన తొలి ఐదు వికెట్ల ఘనతను సాధించిడానికి ఆఖరి వరకు ప్రయత్నించాడు.

ఇక తన బౌలింగ్‌తో ప్రత్యర్ది బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టిన సిరాజ్‌పై భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్‌ లాంటి టాలెంట్‌ ఉన్న చాలా అరుదగా ఉంటాడాని రోహిత్‌ కొనియాడాడు. ఇక ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్‌.. సిరీస్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు.

పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో హిట్‌మ్యాన్‌ మాట్లాడుతూ.. "ఇది మాకు అద్భుతమైన విజయం. ఈ సిరీస్‌లో మాకు చాలా పాజిటివ్‌ ఆంశాలు ఉన్నాయి. బ్యాటింగ్‌ పరంగా కూడా మేము చక్కగా రాణించాం. అదే విధంగా మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. కీలక సమయాల్లో వికెట్లు సాధించారు. ముఖ్యంగా సిరాజ్‌ ఈ సిరీస్‌ అసాంతం అదరగొట్టాడు. గత కొన్ని రోజులుగా సిరాజ్ లో చాలా మార్పు వచ్చింది. అతడు రోజురోజుకూ మరింత రాటుదేలుతున్నాడు. అతడు తన ఇన్‌స్వింగ్‌ బౌలింగ్‌తో జట్టుకు పవర్‌ ప్లేలో శుభారంభం అందిస్తున్నాడు.

సిరాజ్‌ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు.  అదే విధంగా ఆఖరి మ్యాచ్‌లో సిరాజ్‌ ఐదు వికెట్లు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భారత జట్టుకు మరింత లాభం చేకూరుతుంది. ప్రస్తుతం మా దృష్టి అంతా న్యూజిలాండ్‌ సిరీస్‌పై ఉంది. పాకిస్తాన్‌పై చారిత్రాత్మక విజయం సాధించి వచ్చిన న్యూజిలాండ్‌ను ఓడించడం అంత సులభం కాదు"అని  పేర్కొన్నాడు.
చదవండిVirat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే!

>
మరిన్ని వార్తలు