IND vs AUS: నేను చెబితే వినలేదు.. ఇప్పుడు ఇది ఏంటి కుల్దీప్‌? మరోసారి సీరియస్‌ అయిన రోహిత్‌

22 Mar, 2023 18:54 IST|Sakshi

చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు పర్వాలేదనిపించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటర్లలో మిచెల్‌ మార్ష్‌(47), కారీ(38), హెడ్‌(33) పరుగులతో రాణించారు.  

భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌ చెరో మూడు వికెట్లు సాధించగా..అక్షర్‌ పటేల్‌, సిరాజ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇది ఇలా ఉండగా..  ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మధ్య ఆసక్తకిర సంభాషణ చోటు చేసుకుంది.
ఏం జరిగిందంటే?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 38 ఓవర్‌లో కుల్దీప్‌ వేసిన ఓ గుగ్లీ బంతి ఆష్టన్‌ అగర్‌ ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్‌ చేశారు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ క్రమంలో కుల్దీప్‌ రివ్యూ తీసుకోవాలని కెప్టెన్‌ రోహిత్‌ శర్మను సూచించాడు. అయితే రోహిత్‌ మాత్రం రివ్యూ తీసుకోవడానికి నిరాకరించాడు. అయినప్పటికీ కుల్దీప్‌ మాత్రం రోహిత్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాడు.

ఆఖరి సెకన్లలో రోహిత్‌ రివ్యూ తీసుకున్నాడు. అది రివ్యూలో కూడా నాటౌట్‌గా తేలింది. అయితే రివ్యూ తీసుకునే క్రమంలో కుల్దీప్‌పై రోహిత్‌ కాస్త సీరియస్‌ అయ్యాడు. రోహిత్‌కు కోపం రావడానికి ఓ కారణం కూడా ఉంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 25 ఓవర్‌లో  కుల్దీప్‌ వేసిన ఓ బంతి అలెక్స్‌ కారీ ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు రోహిత్‌, విరాట్‌ ఎల్బీకీ అప్పీల్‌ చేశారు.

అయితే అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో వెంటనే రోహిత్‌ శర్మ రివ్యూ తీసుకోవాలని భావించాడు. అయితే కుల్దీప్‌ మాత్రం రోహిత్‌ నిర్ణయాన్ని తిరస్కరించాడు. కనీసం రోహిత్‌ మాటలను కూడా  వినిపించుకోకుండా కుల్దీప్‌ బౌలింగ్‌ ఎండ్‌వైపు వెళ్లిపోయాడు.

కుల్దీప్‌ ప్రవర్తన రోహిత్‌ పాటు విరాట్‌ కోహ్లికి కూడా ఆగ్రహం తెప్పించింది. రిప్లేలో బంతి లెగ్‌ స్టంప్‌ను తాకినట్లు తేలింది. ఇక  మరోసారి అవసరం లేని చోట రివ్యూ కోరడంతో రోహిత్‌ సీరియస్‌ అయ్యాడు.  ఇందుకు సంబంధించిన వీడియో​ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


చదవండి: IND vs AUS: అయ్యో స్మిత్‌.. ఇలా జరిగింది ఏంటి? ప్రతీకారం తీర్చుకున్న హార్దిక్‌! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు