Rohit Sharma: 'పిచ్చోడి మాటలకు విలువుంటుందా?.. ఇదీ అంతే'

17 Aug, 2022 21:58 IST|Sakshi

ఈ మధ్యన వన్డే క్రికెట్‌ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయంటూ తెగ వార్తలు వస్తున్నాయి. టి20 క్రికెట్‌ శకం మొదలయ్యాకా.. 50 ఓవర్ల ఆటపై మోజు తగ్గిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇలాగే ఉంటే వన్డేలు కనుమరుగవుతాయని.. భవిష్యత్తులో టెస్టులు, టి20లు మాత్రమే మిగులుతాయని.. వన్డే మ్యాచ్‌లు కేవలం ప్రపంచకప్‌ లాంటి మేజర్‌ టోర్నీలకు మాత్రమే పరిమితమవుతాయని ఒక వర్గం కామెంట్స్‌ చేసింది.

అయితే మరొక వర్గం మాత్రం వన్డే క్రికెట్‌కు మద్దతుగా నిలబడింది. వన్డే క్రికెట్‌కు వచ్చిన ముప్పు ఏం లేదని.. నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. తాజాగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వన్డే క్రికెట్‌కు మద్దతుగా నిలబడ్డాడు. వన్డే క్రికెట్‌ భవితవ్యంపై ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని.. ఇదంతా నాకు నాన్‌సెన్స్‌గా అనిపిస్తుందని.. పిచ్చి మాటల వల్ల వన్డేలకు ఒరిగే నష్టం ఏం లేదని పేర్కొన్నాడు.

''వన్డే క్రికెట్‌కు నేను కట్టుబడి ఉన్నా. నిజానికి వన్డే క్రికెట్‌ ఎన్నటికి కనుమరుగు కాదు.. అప్‌డేట్‌ అవుతూనే వస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది పిచ్చో‍ళ్లు టెస్టు క్రికెట్‌ గురించే ఇలాంటివే మాట్లాడారు. టెస్టు క్రికెట్‌ కనుమరుగు అవుతుందని పేర్కొన్నారు. కానీ అలా జరగలేదు సరికదా.. టెస్టు క్రికెట్‌పై అభిమానం ఎక్కువైంది. ఏ ఫార్మాట్‌ అయినా సరే.. దేనికి ఉండాల్సిన విలువ దానికే ఉంటుంది.

వన్డేలు.. టి20లు.. టెస్టులు అంతమవుతాయనేది మన భ్రమ.. నేను ఎప్పటికి అలా చెప్పను. పిచ్చోడు చెప్పే మాటలకు విలువుంటుందా.. ఉండదు కదా.. ఇదీ అంతే..  వాస్తవానికి నాకు క్రికెట్‌ పై ఆసక్తి రావడానికి గల కారణం వన్డే క్రికెట్‌. చిన్నప్పటి నుంచి దానినే చూస్తూ పెరిగా. ఇండియాకు ఆడాలని అప్పుడే అనుకున్నా.. ఈరోజు కెప్టెన్‌ స్థాయిలో జట్టును నడిపిస్తున్నా. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలు వారివే'' అంటూ పేర్కొన్నాడు. ఇక రోహిత్‌ నేతృత్వంలోని టీమిండియా ఆసియాకప్‌ 2022లో ఆడనుంది. ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: Rohit Sharma: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్‌మ్యాన్‌

'రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌ అతడే'

మరిన్ని వార్తలు