IND VS ENG 1st ODI: రోహిత్‌ శర్మ భారీ సిక్సర్‌.. బంతి తగిలి చిన్నారికి గాయం

13 Jul, 2022 11:10 IST|Sakshi

Rohit Sharma: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి వన్డే సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఈ మ్యాచ్‌ చూసేందుకు తండ్రితో పాటు స్టేడియంకు వచ్చిన ఓ చిన్నారి రోహిత్‌ శర్మ సిక్సర్‌ కొట్టిన బంతి తగిలి నొప్పితో విలవిలలాడింది. భారత ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో డేవిడ్ విల్లే వేసిన ఓ బంతిని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ పుల్ షాట్ ఆడి భారీ సిక్సర్‌గా మలచగా.. రో'హిట్‌' చేసిన ఆ బంతి స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ చిన్నారికి బలంగా తాకింది. దీంతో ఆ పాప నొప్పితో విలవిలలాడింది. 

ఈ విషయాన్ని బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ తన సహచరులతో చెప్పగా వారు హిట్ మ్యాన్‌కు జరిగింది వివరించారు. విషయం తెలిసిన రోహిత్‌ చిన్నారి గురించి ఆరా తీసే క్రమంలో ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో మ్యాచ్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ మధ్యలో ఇంగ్లండ్ ఫిజియోలు చిన్నారికి ప్రథమ చికిత్స అందించడంతో కోలుకుంది. ఈ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వివరాలను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. 

కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శిఖర్‌ ధవన్‌ (54 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు)లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బుమ్రా (6/19), మహ్మద్‌ షమీ (3/31) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్‌ 110 పరుగులకే చాపచుట్టేసింది.  
చదవండి: బుమ్రా బౌలింగ్‌.. రోహిత్‌ బ్యాటింగ్‌; టీమిండియా ఘన విజయం

>
మరిన్ని వార్తలు