Rohit Sharma-Rishabh Pant: పంత్‌ ప్రవర్తనపై రోహిత్‌ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్‌

7 Aug, 2022 11:34 IST|Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ తన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. వెస్టిండీస్‌తో నాలుగో టి20లో బ్యాటింగ్‌లో 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌తో మెరిసిన పంత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే పూరన్‌ రనౌట్‌ విషయంలో పంత్‌ ప్రవర్తన హిట్‌మ్యాన్‌కు కోపం తెప్పించింది.

విషయంలోకి వెళితే.. విండీస్‌ ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌లో నికోలస్‌ పూరన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ రనౌట్‌ చేసింది ఎవరో కాదు.. రిషబ్‌ పంత్‌. అయితే రనౌట్‌కు ముందు ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో కవర్‌ పాయింట్‌ దిశగా ఆడిన పూరన్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న కైల్‌ మేయర్స్ వద్దని వారించిన వినకుండా ముందుకు పరిగెత్తాడు. అప్పటికే మిడ్‌ఫీల్డ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ వేగంగా పరిగెత్తుకొచ్చి పంత్‌కు క్విక్‌ త్రో వేశాడు. బంతిని అందుకున్న పంత్‌.. వికెట్లను గిరాటేయకుండా సమయాన్ని వృథా చేశాడు.

అయితే పూరన్‌ అప్పటికే సగం క్రీజు దాటి మళ్లీ వెనక్కి వచ్చినా తాను క్లియర్‌ రనౌట్‌ అవుతానని తెలిసి ఆగిపోయాడు. ఆ తర్వాత పంత్‌ బెయిల్స్‌ ఎగురగొట్టాడు. అయితే ఇదంతా గమనించిన రోహిత్‌.. పంత్‌​ దగ్గరకు వచ్చి..''సమయం ఎందుకు వృథా చేస్తున్నావ్‌.. బంతి దొరికిన వెంటనే బెయిల్స్‌ పడగొట్టొచ్చుగా'' అంటూ కోపాన్ని ప్రదర్శించాడు. అయితే తర్వాత కూల్‌ అయిన రోహిత్‌.. నవ్వుతూ పంత్‌ను హగ్‌ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా క్రీజులోకి వచ్చిన వెంటనే మూడు భారీ సిక్సర్లతో విరుచుకుపడిన పూరన్‌ 8 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. అతను క్రీజులో నిలదొక్కుకుంటే ఎంత డేంజర్‌ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే పూరన్‌ రనౌట్‌ విషయంలో పంత్‌ ప్రవర్తనపై రోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అభిమానులు కామెంట్స్‌ చేశారు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టీమిండియా 55 పరుగుల తేడాతో విజయం అందుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (31 బంతుల్లో 44; 6 ఫోర్లు), రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజు సామ్సన్‌ (23 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (14 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం విండీస్‌ 19.1 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. పూరన్‌ (24), రావ్‌మన్‌ పావెల్‌ (24) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. 

చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు'

ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలమవుతారు! అప్పుడు ఫెయిల్‌.. ఇప్పుడు హీరో!

మరిన్ని వార్తలు