Rohit Sharma: సిక్సర్ల విషయంలో రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు

24 Sep, 2022 09:14 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సిక్సర్ల విషయంలో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టి20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా హిట్‌మ్యాన్‌ నిలిచాడు. శుక్రవారం నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ క్రమంలోనే టి20ల్లో అత్యధికి సిక్సర్ల రికార్డును రోహిత్‌ తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్‌.. ఓవరాల్‌గా 176 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గుప్టిల్‌ 172 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా.. క్రిస్‌ గేల్‌ 124 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక విరాట్‌ కోహ్లి 104 సిక్సర్లతో టీమిండియా తరపున టి20ల్లో వంద సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా ఉన్నాడు.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. వర్షం వల్ల 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్‌ (20 బంతుల్లో 43 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఓపెనర్, కెప్టెన్‌ ఫించ్‌ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్‌ 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో గెలిపించాడు. జంపాకు 3 వికెట్లు దక్కాయి. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరి టి20 ఆదివారం హైదరాబాద్‌లో జరుగుతుంది.  

చదవండి: బుమ్రా యార్కర్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఫిదా

మరిన్ని వార్తలు