దటీజ్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ..

6 Nov, 2020 09:00 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్-13లో భాగంగా జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ  క్యాపిటల్స్‌పై  ముంబై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఢిల్లీపై 57 పరుగుల తేడాతో ముంబై గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన రాహుల్‌​ చహర్‌ నిరుత్సాహ పడకుండా ఉండేలా కెప్టెన్‌ రోహిత్‌ చేసిన పని ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంది. ఆ విన్నింగ్‌ స్పిరిట్‌తో డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్లేందుకు జట్టును ముందుండి నడిపించేలా రాహుల్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు. రెండు ఓవర్లలో 35 పరుగుల చెత్త ప్రదర్శన కబరిచినా అతని కాన్ఫిడెన్స్‌ దెబ్బతినకుండా ఉండేందుకు కెప్టెన్‌​ రోహిత్‌ చేసిన ఈ స్టీట్‌ జెస్టర్ అమితంగా ఆకట్టుకుంటుంది. ‘థట్స్‌ అవర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ’ అంటూ ఫ్యాన్స్‌ తెగ ముచ్చటపడుతున్నారు. (ముంబై వేట.. ఆరో సారి ఫైనల్‌కు)

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినప్పటికీ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలు చెలరేగిపోయారు. ఇషాన్‌ కిషన్‌ (30 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్‌ యాదవ్‌ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్‌; 5 సిక్సర్లు) విధ్వంస రచన చేశాడు. వీరి ప్రతాపానికి అశ్విన్‌ (3/29) ప్రదర్శన చిన్నబోయింది.

లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీని ఏ దశలోనూ తేరుకోనివ్వని ముంబై తనమార్కు ఆట తీరుతో చెలరేగిపోయింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా(0), అజింక్యా రహానే(0)లను డకౌట్‌గా పెవిలియన్‌కు చేరగా, స్టొయినిస్‌ (46 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (33 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు సాధించగా, బౌల్ట్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. కృనాల్‌ పాండ్యా, పొలార్డ్‌లకు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడినప్పటికీ మరొక అవకాశం ఉంది. ఆర్సీబీ-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో ఢిల్లీ క్వాలిఫయర్‌-2లో తలపడనుంది. (చెలరేగిన బుమ్రా: ఫైనల్లో ముంబై)


 

మరిన్ని వార్తలు