IND vs AUS: సూర్య కేవలం మూడు బాల్స్‌ మాత్రమే ఆడాడు! అంత మాత్రాన

23 Mar, 2023 10:39 IST|Sakshi

టీ20ల్లో దుమ్మురేపే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్‌.. వన్డేల్లో మాత్రం దయనీయమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడింట్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దాంతో ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా సూర్యకుమార్‌ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు.

 ఇప్పటి వరకు 23 వన్డేలు ఆడిన సూర్య.. 24.05 సగటుతో కేవలం 433 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఆసీస్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమైన సూర్యకుమార్‌ వన్డే కెరీర్‌ ముగిసినట్లే అని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సూర్యకుమార్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరోసారి మద్దుతగా నిలిచాడు. సూర్య తన కెరీర్‌లోనే అత్యంత గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నాడని రోహిత్‌ తెలిపాడు.

మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. "ఈ సిరీస్‌లో సూర్య కేవలం మూడు బంతులు మాత్రమే ఆడాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడు ఎదుర్కొన్న బంతులు అత్యంత కష్టమైనవి. అయితే మూడో మ్యాచ్‌లో ఔటైన తీరు నేను అస్సలు ఊహించలేదు. సూర్య స్పిన్‌కు అద్భుతంగా ఆడగలడు. స్పిన్నర్లను ఎలా అటాక్‌ చేయాలో అతడికి బాగా తెలుసు. గత రెండు ఏళ్లుగా మనం కూడా అది చూస్తున్నాం. అందుకే మేము అతడిని లోయార్డర్‌లో పంపాం.

చివరి 15 నుంచి 20 ఓవర్లలో బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటాడని భావించాం. కానీ దురదృష్టవశాత్తూ అతడు తొలి బంతికే తన వికెట్‌ను కోల్పోయాడు. సూర్య ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నాడు. ఇది ప్రతీ క్రికెటర్‌కు సహజం. ఏ ఆటగాడైనా తన కెరీర్‌లో ఇటువంటి పరిస్ధితులను ఎదుర్కొక తప్పదు. అంత మాత్రన ఆటగాడిలో బ్యాటింగ్‌ పవర్‌ తగ్గినట్లు కాదు. సూర్య అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇస్తాడని అశిస్తున్నాను" అని పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: అదే మా కొంప ముంచింది.. అస్సలు ఊహించలేదు! క్రెడిట్‌ మొత్తం వారికే

మరిన్ని వార్తలు