అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్‌

1 Oct, 2020 16:27 IST|Sakshi

అబుదాబి:  ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో 5 వేల పరుగుల మార్కును చేరేందుకు రోహిత్‌ స్వల్ప దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకూ ఈ జాబితాలో విరాట్‌ ​కోహ్లి, సురేశ్‌ రైనాలు మాత్రమే ఉండగా ఆ తర్వాత స్థానంలో నిలిచేందుకు రోహిత్‌కు రెండు పరుగులు అవసరం.  ఇప్పటివరకూ 4,998 ఐపీఎల్‌ పరుగులు చేసిన రోహిత్‌.. మరో రెండు పరుగులు చేస్తే ఐదు వేల మార్కును చేరతాడు. ఈ లిస్టులో విరాట్‌ కోహ్లి 5,430 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రైనా 5,368 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. (చదవండి: రాబిన్‌ ఊతప్ప నిబంధనలు ఉల్లంఘన)

కోహ్లి 180 మ్యాచ్‌ల్లో ఈ పరుగులు సాధించగా, రైనా 193 మ్యాచ్‌ల్లో 33.34 సగటుతో  ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా, రోహిత్‌ శర్మ ఇప్పటివరకూ 191 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు.  ఐపీఎల్‌ కెరీర్‌లో రోహిత్‌ ఒక సెంచరీతో పాటు 37 హాఫ్‌ సెంచరీలు సాధించాడు.ఈరోజు(గురువారం) కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తలపడుతుండటంతో రోహిత్‌ 5 వేల పరుగుల మార్కును చేరే అవకాశం ఉంది.ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ ఎనిమిది పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఇరుజట్లు 201 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయ్యింది. దాంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైన మ్యాచ్‌లో ముంబై ఏడు పరుగులు చేయగా, ఆర్సీబీ దాన్ని ఛేదించి విజయం సాధించింది. (చదవండి: కమిన్స్‌ నాపై సులభంగా గెలిచాడు : స్మిత్‌)

>
మరిన్ని వార్తలు