సిక్స్‌లతో రెచ్చిపోయిన రోహిత్‌.. ముంబై స్కోరెంతంటే

23 Sep, 2020 20:30 IST|Sakshi

అబుదాబి: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. క్వింటన్‌ డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్‌ మొదటి ఓవర్‌లోనే సిక్స్‌ బాదాడు. అయితే తర్వాతి ఓవర్లో శివమ్‌ మావి బౌలింగ్‌లో డికాక్‌ బారీ షాట్‌కు యత్నించిన డికాక్‌ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో ముంబై 8 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ వరుస ఫోర్లతో ఆకట్టుకున్నాడు. దీనికి తోడు హిట్‌మాన్‌ కూడా సిక్సర్లతో రెచ్చిపోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 6 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. రోహిత్‌కు జత కలిసిన సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా బౌండరీలతో విరుచుకుపడడంతో స్కోరుబోర్డు 10కి పైగా రన్‌రేట్‌తో ఉరకలెత్తింది. ఈ నేపథ్యంలో జట్టు స్కోరు 10.2 ఓవర్లలో 98 పరుగులకు చేరగానే సూర్యకుమార్‌ యాదవ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

ముంబై, కోల్‌కతాల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరిగాయి. అయితే విజయాల్లో ముంబైదే పైచేయిగా కనిపిస్తుంది. వీరి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఏకంగా 19 మ్యాచ్‌ల్లో ముంబయి గెలుపొందగా.. 6 మ్యాచ్‌ల్లో మాత్రమే కోల్‌కతా విజయం సాధించింది. అయితే.. 2014లో యూఏఈ వేదికగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు జరగగా.. అబుదాబి వేదికగా ఈ రెండు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా ఏకంగా 41 పరుగుల తేడాతో ముంబయిపై గెలుపొందడం గమనార్హం. కాగా గత ఐదు మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే 4-1 తేడాతో ముంబై కోల్‌కతాపై పైచేయిలో ఉంది. ముంబై ఇండియన్స్‌ 4సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గగా.. కోల్‌కతా రెండుసార్లు ఆ ఫీట్‌ను సాధించింది. (చదవండి : 'ధోని విషయంలో ప్రతీసారి ఈ ప్రశ్న వస్తుంది')

మరిన్ని వార్తలు