Joe Root: ఐపీఎల్ వేలం నుంచి తప్పుకున్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌.. దేశం కోసం అంటూ వ్యాఖ్యలు

17 Jan, 2022 16:08 IST|Sakshi

IPL Auction 2022: ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి ముందు ఇంగ్లండ్ టెస్ట్‌ సారథి జో రూట్ కీలక ప్రకటన చేశాడు. ఫిబ్రవరిలో జరగబోయే ఐపీఎల్‌ మెగా వేలం నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. యాషెస్‌ సిరీస్‌కు ముందు ఐపీఎల్‌ అరంగేట్రం చేయాలని భావించినప్పటికీ.. ఆసీస్‌ చేతిలో 0-4 తేడాతో సిరీస్‌ను కోల్పోవడంతో వేలం​ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. యాషెస్ సిరీస్ అనంతరం  రూట్ మాట్లాడుతూ.. నా జట్టు కోసం చేయాల్సింది చాలా ఉంది. అందుకోసం నేను చేయగలిగినంత త్యాగం(ఐపీఎల్‌ వేలం నుంచి వైదొలగడం) చేస్తాను.

ప్రస్తుతానికి నా దృష్టంతా ఇంగ్లండ్ టెస్టు క్రికెట్‌పైనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా, రూట్‌ తొలిసారి 2018 ఐపీఎల్‌ సీజన్‌లో తన పేరును వేలానికి ఉంచాడు. అయితే, అప్పుడు అతన్ని తీసుకునేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ ద్వారా ఎలాగైనా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని రూట్‌ పట్టుదలగా ఉన్నాడు. అయితే, యాషెస్‌ ఓటమి అతని ఐపీఎల్‌ ఎంట్రీ ఆశలపై నీళ్లు చల్లింది. ఇదిలా ఉంటే, యాషెస్‌లో దారుణ పరాజయం అనంతరం ఇంగ్లండ్‌ జట్టులో భారీ మార్పులు తప్పవని తెలుస్తోంది. కెప్టెన్ రూట్‌తో పాటు పలువురు సీనియర్లపై వేటు వేయాలని భారీ స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. 
చదవండి: బీసీసీఐ క్రేజీ ఆఫర్‌.. నో చెప్పిన కోహ్లి..!
 

మరిన్ని వార్తలు