IPL 2022: 'వార్నర్‌ను సెంచరీ గురించి అడిగాను.. నన్ను హిట్టింగ్‌ చేయమన్నాడు'

7 May, 2022 07:48 IST|Sakshi
Courtesy: IPL Twitter

సన్‌రైజర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్‌ ముగిసే సరికి ఢిల్లీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 54 బంతుల్లో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో బ్యాటింగ్‌ చేస్తే తన పాత జట్టుపై సెంచరీ చేసే అవకాశం అతనికి ఉండేది. అయితే వ్యక్తిగత ప్రదర్శనకంటే జట్టే ముఖ్యమంటూ వార్నర్‌ దానిని సీరియస్‌గా తీసుకోలేదని అతని సహచర బ్యాటర్‌ రావ్‌మన్‌ పావెల్‌ వెల్లడించాడు. చివరి ఓవర్లో 6 బంతులను కూడా ఎదుర్కొన్న పావెల్‌ 3 ఫోర్లు, 1 సిక్స్‌ బాదాడు.

‘చివరి ఓవర్‌ ప్రారంభానికి ముందు వార్నర్‌ను నేను సెంచరీ గురించి అడిగాను. తొలి బంతికి సింగిల్‌ తీసి నీకు స్ట్రైకింగ్‌ ఇవ్వనా, శతకం పూర్తవుతుంది అని చెప్పాను. అయితే వార్నర్‌ దానిని తిరస్కరించాడు. మనం ఈ రకంగా క్రికెట్‌ ఆడకూడదు. నువ్వు నీ అత్యుత్తమ బ్యాటింగ్‌ చూపించు. ఎంత బలంగా బంతిని బాదగలవో అంతగా షాట్లు ఆడు అంటూ నాలో స్ఫూర్తి నింపాడు’ అని పావెల్‌ వివరించాడు. మ్యాచ్‌లో ఢిల్లీ 21 పరుగులతో గెలవగా, వార్నర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: చహల్‌తో కలిసి డ్యాన్స్‌ ఇరగదీసిన ఇంగ్లండ్‌ స్టార్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు