SA T20 League: మాజీలు సైమన్‌ కటిచ్‌, హషీమ్‌ ఆమ్లాలకు కీలక పదవులు

15 Sep, 2022 12:44 IST|Sakshi

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ సైమన్‌ కటిచ్‌ను కీలక పదవి వరించింది. సౌతాఫ్రికా టి20 లీగ్‌లో భాగంగా ముంబై కేప్‌టౌన్‌ను.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబై కేప్‌టౌన్‌కు కొత్త కోచ్‌లను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆసీస్‌ మాజీ ఆటగాడు సైమన్‌ కటిచ్‌ ముంబై కేప్‌టౌన్‌ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇక దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లాను తమ బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించింది.  ఇక ఫీల్డింగ్‌ కోచ్‌గా జేమ్స్‌ పామెంట్‌ను.. అలాగే జట్టు జనరల్‌ మేనేజర్‌గా రాబిన్‌ పీటర్సన్‌ను ఎంపిక చేస్తూ ముంబై కేప్‌టౌన్‌ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. 

కాగా ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం సైమన్‌ కటిచ్‌కు ట్విటర్‌ వేదికగా వెల్‌కమ్‌ చెప్పింది. ''సైమన్‌ కటిచ్‌ ముంబై కేప్‌టౌన్‌ కోచ్‌గా ఎంపికవ్వడం మాకు ఎంతో ఉత్సాహానిస్తుంది. ముంబై కేప్‌టౌన్‌ హెడ్‌కోచ్‌గా మీకు మా ఫ్యామిలీలోకి స్వాగతం'' అంటూ పేర్కొంది. 

ఇక సైమన్‌ కటిచ్‌ స్పందింస్తూ.. ''ముంబై కేప్‌టౌన్‌కు ప్రధాన కోచ్‌గా ఎంపికవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకముంచి ఒక కొత్త జట్టుకు కోచ్‌గా పనిచేయాలని బాధ్యత అప్పగించారు. జట్టులో ఆటగాళ్ల నైపుణ్యతను, సమతుల్యతను పెంచేలా పనిచేస్తాను. లోకల్‌ ఆటగాళ్ల నైపుణ్యతను బయటికి తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ముంబై ఇండియన్స్‌ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు'' అంటూ తెలిపాడు. 

ఇక జనవరిలో జరగనున్న ఆరంభ ఎడిషన్‌కు అంతా సిద్ధమవుతుంది. ఎంఐ కేప్‌టౌన్‌ వెల్లడించిన ఫస్ట్‌ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కగిసో రబడ, డెవాల్డ్‌ బ్రెవిస్‌(అన్‌క్యాప్డ్‌)తో పాటు ఫారిన్‌ ప్లేయర్లు రషీద్‌ ఖాన్‌(అఫ్గనిస్తాన్‌), సామ్‌ కరన్‌(ఇంగ్లండ్‌), లియామ్‌ లివింగ్‌స్టోన్‌(ఇంగ్లండ్‌) ఉన్నారు. కాగా ఈ టీ20 లీగ్‌ వేలానికి ముందే నిబంధనల ప్రకారం ఐదుగురు ఆటగాళ్లతో ఎంఐ కేప్‌టౌన్‌ ఒప్పందం చేసుకుంది.

చదవండి: లియాండర్‌ పేస్‌ గురువు కన్నుమూత

ప్రారంభానికి ముందే టి20 ప్రపంచకప్‌ 2022 కొత్త చరిత్ర

మరిన్ని వార్తలు