saba karim comments on virat kohli and Rohit sharma: టీ20ప్రపంచకప్-2021లో నవంబరు 3న కీలక మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జట్టు క్లిష్ట పరిస్థితిలో పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే వాళ్లు ఇద్దరూ ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభిస్తారని, వాళ్లు ఆటను వేగవంతం చేయడానికి చాలా సమయం పడుతుందని అతడు తెలిపాడు.
"భారత్కు ఒక పెద్ద సమస్య ఏమిటంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ ఒకేలా ఆడతారు. వాళ్ల ఇన్నింగ్స్ను నెమ్మదిగా ప్రారంభిస్తారు. వారు మధ్యలో బౌండరీలు లేదా సిక్సర్లు కొట్టడం ద్వారా ఇన్నింగ్స్ను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరూ ఒకేసారి క్రీజులో ఉన్నప్పుడు సమస్య తలెత్తుతుంది. ఎవరూ రిస్కు తీసుకోవడానికి సాహసం చేయరు. కాబట్టి.. సహజంగానే అప్పుడు స్ట్రైక్ రేట్ తగ్గుతుంది. వాళ్ల స్ట్రైక్రేట్ను మెరుగుపరచకుండానే ఇద్దరూ చాలా బంతులను ఎదుర్కొంటారు.
ఇది జట్టుని ఇబ్బందికరమైన స్థితిలో పడేస్తుంది. టీ20 క్రికెట్లో వేగవంతంగా ఆడే ఆటగాళ్లు కావాలి. ముఖ్యంగా భారత్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినప్పుడు, వారిద్దరూ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం చాలా బంతులును వినియోగించుకుంటారు. కేవలం సింగిల్స్ తీయడం ద్వారా స్ట్రైక్ రోటేట్ చేస్తే ఓవర్లో ఆరు పరుగులు కూడా పొందలేరు. కాబట్టి బౌండరీలు వచ్చే విధంగా ఆడాలి" అని సబా కరీమ్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.
చదవండి: అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు.. వైరలవుతున్న బీసీసీఐ ట్వీట్