కరోనా కల్లోలం: సచిన్‌, ఐపీఎల్‌ జట్ల విరాళాలు ఎంతంటే!

30 Apr, 2021 08:00 IST|Sakshi

ముంబై: కరోనా బాధితులకు సహాయం అందించేందుకు తమ వంతుగా వితరణ ఇచ్చేందుకు ఐపీఎల్‌ టీమ్‌లు ముందుకు వచ్చాయి. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇందుకోసం రూ. 7.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టీమ్‌ యాజమాన్యం అందరి భాగస్వామ్యం ఉన్నట్లు రాయల్స్‌ ప్రకటించింది. తాము ఇచ్చిన నిధులు ప్రధానంగా రాజస్తాన్‌ రాష్ట్రంలో ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమన్యం కూడా రూ. 1.5 కోట్లు ప్రకటించింది. టీమ్‌ సహ యజమానులు తమ జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్, వరలక్ష్మి ఫౌండేషన్‌ తరఫున ఈ మొత్తాన్ని అందిస్తున్నారు. ఢిల్లీకి చెందిన రెండు ఎన్జీఓలకు ఈ విరాళం ఇస్తున్నామని... సరైన రీతిలో ఈ నిధులు వినియోగం అయ్యేలా ఆ రెండు సంస్థలు బాధ్యత తీసుకుంటాయని ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పష్టం చేసింది.  

సచిన్‌ కూడా... 
మరో వైపు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా తన వంతుగా సహకారం అందించేందుకు ముందుకు వచ్చాడు. కోవిడ్‌ రోగులు ఆక్సిజన్‌ కొరత కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత స్థితిలో దానిని నివారించేందుకు అతను సహాయం అందించనున్నాడు. ‘250 మంది సభ్యుల ఒక యువ బృందం మిషన్‌ ఆక్సిజన్‌ పేరుతో నిధుల సేకరణ చేస్తోంది. నా వైపునుంచి వారికి విరాళం ఇచ్చాను’ అని ప్రకటించిన సచిన్‌ ఎంత మొత్తం అనేది అధికారికంగా చెప్పకపోయినా రూ.1 కోటి అని సమాచారం.

చదవండి: సన్‌రైజర్స్‌ క్రికెటర్‌ ఔదార్యం.. మనసులు గెల్చుకున్నావ్‌!

మరిన్ని వార్తలు