Lata Mangeshkar: తన ఆరాధ్య గాయనికి కన్నీటి నివాళులర్పించిన క్రికెట్‌ గాడ్‌

6 Feb, 2022 18:59 IST|Sakshi

Sachin Tendulkar Pays Tribute To Lata Mangeshkar: క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ సతీసమేతంగా.. తన ఆరాధ్య గాయని లతా మంగేష్కర్‌ పార్థివ దేహాన్ని దర్శించుకుని కన్నీటి నివాళులర్పించాడు. ముంబైలోని శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్‌ అంతిమ సంస్కారాల సమయంలో సచిన్‌ కన్నీటి పర్యంతమయ్యాడు.  అనంతరం ట్విటర్‌ వేదికగా సచిన్‌ తన సంతాప సందేశాన్ని షేర్‌ చేశాడు. 


"లతా  ఆయీ (మరాఠీలో అమ్మ అని అర్థం)  జీవితంలో నాకు కొంత భాగం దక్కినందుకు గర్వపడుతున్నా. ఆమె ఎల్లప్పుడూ నాపై అమితమైన ప్రేమ చూపించేవారు. ఆమె మరణం నాకు తీరని లోటు. ఆమె తన గాత్రంతో ఎల్లప్పుడూ మన హృదయాల్లో బతికే ఉంటుంది" అంటూ సచిన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. కాగా, సచిన్‌కు లతా మంగేష్కర్‌తో ఆత్మీయ అనుబంధం ఉంది. ఆయన తరుచూ ఆమెను కలిసి యోగక్షేమాలు తెలుసుకునేవాడు. లతాజీని సచిన్‌ ప్రేమగా ‘ఆయీ’ అని పిలిచేవాడు. 

ఇదిలా ఉంటే, గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్(92) ఇవాళ ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం శివాజీ పార్క్‌లో జరిగిన ఆమె అంత్యక్రియలకు ప్రధాని మోదీ సహా పలు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 
చదవండి: IND VS WI 1st ODI: కోహ్లినా మజాకా.. పంత్‌ను కాదని మాజీ కెప్టెన్‌ సలహా కోరిన హిట్‌మ్యాన్‌

>
మరిన్ని వార్తలు