వైరలవుతోన్న సచిన్‌ ప్రాంక్‌ వీడియో

9 Mar, 2021 15:36 IST|Sakshi

వైద్య సిబ్బందితో ప్రాంక్‌ చేసిన సచిన్‌

ముంబై: కరోనా విజృంభణ వల్ల ఆటగాళ్లకు ప్రతి రోజు ప్రాక్టీస్‌ ఎంత ముఖ్యమో.. కోవిడ్ టెస్ట్‌ కూడా అంతే ముఖ్యమైనది. వారి జీవితంలో ప్రతి రోజు కోవిడ్‌ పరీక్ష తప్పని సరి అయ్యింది. ఈ క్రమంలో కరోనా టెస్ట్‌ చేస్తుండగా.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చేసిన ప్రాంక్‌ వీడియో వైరలవుతోంది. ప్రస్తుతం సచిన్‌ రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌ కోసం రాయ్‌పూర్‌లో ఉన్నాడు. ప్రొటోకాల్‌ ప్రకారం సచిన్‌కు కోవిడ్‌ టెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు వైద్య సిబ్బంది. ఈ క్రమంలో సచిన్‌ తనకు కరోనా టెస్ట్‌ చేయడానికి వచ్చిన మెడికల్‌ టీమ్‌తో ప్రాంక్‌ చేయాలని భావించాడు. 

ఈ నేపథ్యంలో మంగళవారం మెడికల్‌ సిబ్బంది ఒకరు సచిన్‌ ముక్కు నుంచి స్వాబ్‌ తీసుకుంటుండగా.. నొప్పితో బాధపడినట్లు నటించాడు. దాంతో శాంపిల్స్‌ తీసుకుంటున్న వ్యక్తి కంగారు పడ్డాడు. స్వాబ్‌ కలెక్ట్‌ చేయడం పూర్తయిన తర్వాత సచిన్‌ వెంటనే తుమ్మాడు. దాంతో అ‍క్కడున్న వారు కంగారు పడ్డారు. అది చూసిన సచిన్‌ తాను ఊరికే నటించానని.. వారిని నవ్వించేందుకే ఇలా చేశానని తెలిపాడు. ఆ తర్వాత సచిన్‌ నోటి నుంచి శాంపిల్స్‌ సేకరించారు వైద్య సిబ్బంది.

ఇందుకు సంబంధించిన వీడియోని సచిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘‘200 టెస్టులు ఆడాను.. 277 సార్లు కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నాను.. వైద్య సిబ్బందిని చీరప్‌ చేయడం కోసం ఇలా చిన్న ప్రాంక్‌ చేశాను. ఓ మంచి కారణం కోసం మేం ఈ సిరీస్‌ ఆడుతున్నాం. ఈ క్రమంలో మా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ.. మాకు సాయం చేసస్తోన్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు’’ అనే క్యాప్ష​న్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలువుతోంది. రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇండియా లెజెండ్స్‌, ఇంగ్లండ్‌ లెజెండ్స్‌తో తల పడనుంది. 

గతేడాది ప్రారంభం అయిన రోడ్‌ సేఫ్టీ సిరీస్‌ కరోనా కారణంగా ఆగి పోయింది. అయితే తాజాగా ఈ నెల ఐదో తారీఖు నుంచి గతేడాది ఎక్కడైతే ఆగిపోయిందో మళ్లీ అ‍్కడి నుంచే సిరీస్‌ పునఃప్రారంభం అయ్యింది. 

చదవండి:
వయసు పెరిగినా పదును మాత్రం తగ్గలేదు
మా పాజీ తర్వాత మ్యాచ్ ఆడుతాడా!

మరిన్ని వార్తలు