Saina Nehwal, Kidambi Srikanth: సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ

29 May, 2021 02:03 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌కు దక్కని బెర్త్‌లు

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ టోక్యో ఒలిం పిక్స్‌కు అర్హత పొందలేకపోయారు. టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యేలోపు ఎలాంటి క్వాలిఫయింగ్‌ టోర్నీలు నిర్వహించడంలేదని... జూన్‌ 15వ తేదీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా టోక్యో బెర్త్‌లు ఖరారు చేస్తామని బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో టాప్‌–16 ర్యాంకింగ్స్‌లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొనే అవకాశం లభిస్తుంది.

భారత్‌ నుంచి మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో... సైనా 22వ ర్యాంక్‌లో... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ 13వ ర్యాంక్‌లో... శ్రీకాంత్‌ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. దాంతో భారత్‌ నుంచి సింధు, సాయిప్రణీత్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. పురుషుల డబుల్స్‌లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. 

మరిన్ని వార్తలు