ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ టోర్నీ: క్వార్టర్స్‌లో సైనా‌

25 Mar, 2021 20:16 IST|Sakshi

పారిస్‌: లండన్‌ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.. ఓర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన 65వ సీడ్‌ మేరీ బాటోమెన్‌ను 18-21, 21-15, 21-10తో ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. 51 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో సైనా అద్భుత ప్రదర్శన చేసి,తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. నాలుగోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉన్న సైనా.. ర్యాంకింగ్ పాయింట్లు దక్కించుకొని ఒలింపిక్‌ రేసులో నిలవాలని భావిస్తుంది. కాగా, గాయం కారణంగా గత వారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగిన సైనా.. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన యాయెల్ హోయాక్స్ లేదా మలేషియాకు చెందిన ఐరిస్ వాంగ్‌తో తలపడనుంది.

ఇదే టోర్నీలో మరో భారత షట్లర్‌ ఇరా శర్మ కూడా క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. ఐరా.. బల్గేరియాకు చెందిన మరియా మిట్సోవాను 21-18, 21-13 తో ఓడించింది. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన ఈ గేమ్‌లో ఐరా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇరా తన తదుపరి గేమ్‌లో డెన్మార్క్‌కు చెందిన లైన్‌ క్రిస్టోఫెర్సన్‌తో పోటీపడే అవకాశం ఉంది. కాగా, బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌లో కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేతలు అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట.. డెన్మార్క్ జంట అమాలీ మాగెలుండ్, ఫ్రీజా రావ్న్‌పై 21-9, 17-21, 21-19తో విజయం సాధించారు.

మరిన్ని వార్తలు