సైనా నెహ్వాల్‌కు కరోనా.. టోర్నమెంట్‌ నుంచి అవుట్‌

12 Jan, 2021 11:04 IST|Sakshi

భారత స్టార్‌ షట్లర్ సైనా నెహ్వాల్‌కు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సోమవారం నిర్వహించిన మూడో టెస్టులో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. నేటి నుంచి(మంగళవారం) థాయ్‌లాండ్ ఓపెన్‌ సూపర్‌-1000 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సైనా కరోనా బారిన పడటం ఆందోళన కరంగా మారింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి సైనా సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నిర్వాహకులు ముందస్తు చర్యల్లో భాగంగా పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు పరీక్షలను నిర్వహించారు ఈ పరీక్షల్లో సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తొలి రౌండ్‌లో మలేసియాకు చెందిన షట్లర్‌ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని  బీడబ్ల్యూఎఫ్‌ కోరింది. సైనాతోపాటు మరో భారత షట్లర్‌ ప్రణయ్‌ కూడా కోవిడ్‌ బారిన పడ్డాడు. చదవండి: నేటి నుంచి థాయ్‌లాండ్‌ ఓపెన్‌

జనవరి 6న గ్రీన్ జోన్ క్వారంటైన్‌లో పాల్గొన్న మొత్తం 824 మంది కోవిడ్‌ నెగిటివ్‌గా పరీక్షించారు. వీరిలో ఆటగాళ్లు, అంపైర్లు, లైన్ జడ్జీలు, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యుఎఫ్), బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్, వైద్య సిబ్బంది, టీవీ ప్రొడక్షన్ సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ గ్రీన్ జోన్‌ క్వారంటైన్‌లో పాల్గొనే వారందరూ బ్యాంకాక్‌కు బయలుదేరే ముందు తమ దేశంలోనే కరోనా నెగటీవ్‌ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని బీడబ్ల్యూఎఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. వీరు బ్యాంకాక్‌కు చేరుకున్న తర్వాత కూడామళ్లీ మళ్లీ కరోనా టెస్టు చేయించుకున్నారని తెలిపింది.

టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ రాకెట్‌ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ బరిలోకి దిగుతున్నారు. కరోనా వైరస్‌తో దాదాపు 10 నెలల తర్వాత వీళ్లిద్దరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఆడనున్నారు. వీరితో పాటు భారత ఆటగాళ్లంతా మంగళవారం నుంచి జరిగే థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు. ఇందులో జపాన్, చైనా ప్లేయర్లు గైర్హాజరీ కావడంతో భారత స్టార్లు టైటిల్‌ గెలిచేందుకు ఇది సరైన అవకాశం. లండన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 25 ఏళ్ల సింధు ఆరో సీడ్‌గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు