సమయం వచ్చేసింది... సాక్షి క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీకి ఎంట్రీల ఆహ్వానం

31 Oct, 2021 05:31 IST|Sakshi

మీకు క్రికెట్‌ అంటే ప్రాణమా? ప్రతిభ ఉన్నా సత్తా చాటుకోవడానికి సరైన వేదిక కోసం వేచి చూస్తున్నారా? అయితే ఎందుకు ఆలస్యం... సమయం వచ్చేసింది... బ్యాట్‌ పట్టుకోండి... బంతితో చెలరేగిపోండి... మీ కలలను నిజం చేసుకోండి... ప్రస్తుతం మీరు చేయాల్సిందల్లా ... ముందుగా ఎంట్రీలు పంపించడం... ఆ తర్వాత మైదానంలోకి దిగడమే! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఔత్సాహిక క్రికెటర్లకు సువర్ణావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ చివరి వారంలో సాక్షి క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఎస్‌పీఎల్‌) మూడో సీజన్‌ మొదలుకానుంది.

ఎస్‌పీఎల్‌ రెండో సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్‌ డిగ్రీ కాలేజీ (అనంతపురం), జూనియర్‌ విభాగంలో శాతవాహన జూనియర్‌ కాలేజీ (శ్రీకాకుళం) చాంపియన్స్‌గా నిలిచాయి. తెలంగాణ గ్రేటర్‌ హైదరాబాద్‌ రీజియన్‌ సీనియర్‌ విభాగంలో భవన్స్‌ డిగ్రీ కాలేజీ (సైనిక్‌పురి), జూనియర్‌ విభాగంలో భవాన్స్‌ శ్రీ ఆరంబిందో జూనియర్‌ కాలేజీ (సైనిక్‌పురి), నార్త్‌ తెలంగాణ రీజియన్‌ సీనియర్‌ విభాగంలో వాగ్దేవి డిగ్రీ కాలేజీ (మంచిర్యాల), ఎస్‌ఆర్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీ (మంచిర్యాల), సౌత్‌ తెలంగాణ రీజియన్‌ సీనియర్‌ విభాగంలో మాస్టర్‌జీ పీజీ కాలేజీ (హనుమకొండ) జూనియర్‌ విభాగంలో హార్వెస్ట్‌ జూనియర్‌ కాలేజీ (ఖమ్మం) టైటిల్స్‌ నెగ్గాయి.  

టోర్నీ ఫార్మాట్‌...
ముందుగా జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో నాకౌట్‌ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్లపాటు నిర్వహిస్తారు.  జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన జట్లు ప్రాంతీయ స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లను 20 ఓవర్లపాటు నిర్వహిస్తారు. ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేతలు రాష్ట్ర స్థాయిలో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో టైటిల్‌ కోసం తలపడతాయి. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు.
 
ఎంట్రీ ఫీజు...
ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1,500 ఎంట్రీ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌ పద్ధతిలోనూ చెల్లించవచ్చు. వివరాలకు సాక్షి జిల్లా యూనిట్‌ కార్యాలయంలో సంప్రదించాలి. www.arenaone.in వెబ్‌సైట్‌లోనూ వివరాలు లభిస్తాయి. ఎంట్రీలను డిసెంబర్‌ 10వ తేదీలోపు పంపించాలి.  

ఏ ఏ విభాగాల్లో...
సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్‌–19 జూనియర్‌ స్థాయిలో (1–12–2002 తర్వాత జన్మించి ఉండాలి)... అండర్‌–25 సీనియర్‌ స్థాయిలో (1–12–1996 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు. జూనియర్‌ స్థాయిలో ఆడేందుకు జూనియర్‌ కాలేజీ జట్లకు,  సీబీఎస్‌ఈ స్కూల్‌ (ప్లస్‌ 11,12) జట్లకు, ఐటీఐ, పాలిటెక్నిక్‌ జట్లకు అర్హత ఉంది. సీనియర్‌ స్థాయిలో ఆడేందుకు డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీ జట్లకు అవకాశం కల్పిస్తారు.  

ఎన్ని జట్లకు అవకాశం...
ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా రెండు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. రెండు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఒక జట్టులో ఆడే ఆటగాడు మరో జట్టుకు ఆడకూడదు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం....
www.arenaone.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. మ్యాచ్‌లు ఆడే సమయంలో ఆటగాళ్లు వయసు ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. మ్యాచ్‌ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్‌) చూపించాలి.
మ్యాచ్‌ జరిగే సమయంలో బ్యాట్స్‌మెన్, వికెట్‌ కీపర్‌ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్‌ ప్యాడ్‌లు, అండర్‌ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్‌ డ్రెస్, వైట్‌ షూస్‌ ధరించాలి.  
గమనిక: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

► తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలను మూడు రీజియన్‌లుగా విభజించారు. 
► రీజియన్‌–1లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌ ఉన్నాయి.
► రీజియన్‌–2లో వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉన్నాయి. ∙ రీజియన్‌–3లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉన్నాయి.
► ఒక్కో జోన్‌ నుంచి విజేత జట్టు రాష్ట్రస్థాయి టోర్నీకి అర్హత సాధిస్తుంది.

ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించాల్సిన ఫోన్‌నంబర్లు (తెలంగాణ రీజియన్‌)
99120 35299 (హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌)   
950 551 4424, 96660 13544 (వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్‌)

మరిన్ని వార్తలు