SPL 2022: రసవత్తరంగా సాక్షి ప్రీమియర్‌ లీగ్‌

20 Mar, 2022 11:20 IST|Sakshi

విజయవాడ స్పోర్ట్స్‌: ‘సాక్షి’ ప్రీమియర్‌ లీగ్‌ (ఎస్‌పీఎల్‌) క్రికెట్‌ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. కేసీపీ సిద్ధార్థ ఆదర్శ పబ్లిక్‌ స్కూల్‌ క్రికెట్‌ మైదానంలో శనివారం జూనియర్, సీనియర్‌ విభాగాల్లో నాలుగేసి జట్లు తలపడ్డాయి. ‘సాక్షి’ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీకి ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొర్పొరేషన్‌ (ఏపీఎండీసీ) రీజనల్‌ స్పాన్సర్‌గా, డ్యూక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రీఫ్రెష్‌మెంట్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాయి. 

సత్తాచాటిన ‘ఎన్‌ఆర్‌ఐ’ 
జూనియర్‌ విభాగంలో ఎన్‌ఆర్‌ఐ జూనియర్‌ కాలేజీ, నలంద జూనియర్‌ కాలేజీ జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన నలంద జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఎన్‌ఆర్‌ఐ జట్టు నిరీ్ణత 10 ఓవర్లకు ఐదు వికెట్లు నష్టపోయి 64 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ కె.రేవంత్‌ 22 పరుగులతో రాణించాడు. 65 పరుగుల విజయలక్ష్యంతో బరి లో దిగిన నలంద జట్టు ఏడు ఓవర్లో 27 పరుగులకే కుప్పకూలింది. ఎన్‌ఆర్‌ఐ జట్టు 37 పరుగుల తేడాతో గెలిచింది. ఎన్‌ఆర్‌ఐ బౌలర్లు జాఫర్‌ మూడు, రేవంత్‌ రెండు వికెట్లు తీశారు. జాఫర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.  

రెండు వికెట్ల తేడాతో  పాలిటెక్నిక్‌ కాలేజీ గెలుపు 
మరో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ జట్టుపై ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ జట్టు రెండు వికెట్ల తేడాతో గెలిచింది. పాలిటెక్నిక్‌ కాలేజీ జట్టు టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఎస్‌ఆర్‌ఆర్‌ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. పాలిటెక్నిక్‌ కాలేజీ జట్టు ఎనిమిది వికెట్లు నష్టపోయి చివరి ఓవర్లో 57 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.  రెండు కీలక వికెట్లు తీసిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ బౌలర్‌ కె.ఉదయ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్నాడు.  

పీవీపీ సిద్ధార్థ(టీమ్‌–2) ప్రతిభ 
సీనియర్‌ విభాగంలో పీవీపీ సిద్ధార్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నా లజీ(టీమ్‌–2) జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటింది. టాస్‌ గెలిచిన సిద్ధార్ధ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పీవీపీ సిద్ధార్థ జట్టు ఆది నుంచే దూకుడుగా ఆడి నిర్ణీత 10 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. ఓపెనర్‌లు జి.శ్రీను 30 బంతులకు 36, షేక్‌ ఫరాహాన్‌ సోహైల్‌ 12 బంతులకు 21 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జట్టు ఓపెనర్లు పవన్‌       కల్యాణ్, చరణ్‌ వెంటవెంటనే ఔటయ్యారు. నిర్ణీత ఓవర్లలో ఈ జట్టు ఆరు వికెట్లు నష్టపోయి 37 పరుగులు చేసి ఓటమిపాలైంది. 36 పరుగులు చేసిన పీవీపీ సిద్ధార్థ బ్యాట్స్‌మెన్‌ జి.శ్రీను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.  

నాలుగు వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌కే కాలేజీ విజయం 
మరో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌కే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్‌ కాలేజీ జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పొట్టి శ్రీరాములు కాలేజీ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు తొమ్మిది వికెట్లు నష్టపోయి 51 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌కే కాలేజీ జట్టు ఆరు వికెట్లు నష్టపోయి 56 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. రెండు వికెట్లు తీసిన ఎస్‌ఆర్‌కే కాలేజీ బౌలర్‌ జ్ఞానేశ్వర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 

మరిన్ని వార్తలు