SPL 2022: ఘనంగా ముగిసిన సాక్షి ప్రీమియర్ లీగ్ పోటీలు.. విజేతలు ఎవరంటే..?

20 Apr, 2022 18:56 IST|Sakshi

సాక్షి, గుంటూరు:  ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ (ఎస్పీఎల్‌) 2022 రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 649 జట్లు పోటీపడ్డాయి. సీనియర్స్‌ విభాగంలో సీకాం డిగ్రీ కాలేజ్ (తిరుపతి) జట్టు విజేతగా నిలువగా, విజయనగరం ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.  

ఇదే టోర్నీ జూనియర్ విభాగంలో సర్ సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్ (ఏలూరు) జట్టు టైటిల్‌ సాధించగా, విశాఖపట్నం సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజ్ రన్నరప్‌గా నిలిచింది. సీనియర్ విభాగంలో ఎస్ ఆఫ్రోజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకోగా, ఎం రవికిరణ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. జూనియర్ విభాగంలో జి. సంజయ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డుతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు. విజేతలకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి బహుమతులు అందజేశారు.

సీనియర్, జూనియర్ విభాగంలో విన్నర్స్‌కు 25వేలు, రన్నరప్‌కు 15వేలు చెక్కులు అందజేశారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి సాక్షి డిప్యూటీ ఎడిటర్ రాఘవ రెడ్డి, అడ్వర్టైజ్ జీఎం వెంకట్ రెడ్డి, కేఎల్‌యూ అడ్మిన్ డైరెక్టర్ జేఎస్ఆర్ శ్రీనివాస్, అసిసోయేట్ డీన్ హరి కిషోర్, డీన్ ఎంహెచ్ ఎస్ కిషోర్ బాబు తదితరులు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు