Sakshi premier League 2022: హోరాహోరీగా ‘సాక్షి’ ప్రీమియర్‌ లీగ్‌..

14 Apr, 2022 08:40 IST|Sakshi
సీనియర్స్‌ విభాగంలో విజేత ఎంఎల్‌ఆర్‌ఐటీ జట్టు

కుత్బుల్లాపూర్‌: సాక్షి’ మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సాక్షి ప్రీమియర్‌ లీగ్‌’ రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలు బుధవారం దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీ గ్రౌండ్‌లో జరిగాయి. అండర్‌–19, అండర్‌–26 సీనియర్, జూనియర్‌ విభాగాల్లో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లు ఆద్యంతం ఉత్కంఠంగా సాగాయి.  కళాశాల చైర్మన్‌ మర్రి లక్ష్మణ్‌రెడ్డి టాస్‌ వేసి పోటీలను ప్రారంభించారు. ‘సాక్షి’ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఉగ్రగిరి రావు,  ఈవెంట్‌ కో.ఆర్డినేటర్లు వేణు, సుమన్, కళాశాల స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు. 

సీనియర్స్‌ విభాగంలో వాగ్దేవి బోణీ 
వాగ్దేవి డిగ్రీ కశాళాల(మంచిర్యాల), ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల (సూర్యపేట) జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఎస్వీ కళాశాల జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వాగ్దేవి కళాశాల జట్టు బ్యాట్స్‌మెన్‌ సైఫ్‌ 26 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఏకంగా 46 పరుగులు సాధించడంతో 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 85 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఎస్వీ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి కేవలం 68 పరుగులు మాత్రమే చేసింది. 17 పరుగుల తేడాతో వాగ్దేవి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రాణించిన సాహిప్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మెన్గా, బెస్ట్‌ బౌలర్‌గా అశ్విక్‌ ఎంపికయ్యారు. 

మరో మ్యాచ్‌లో ఎంఎల్‌ఆర్‌ఐటీ విజయం.. 
సీనియర్స్‌ విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఎంఎల్‌ఆర్‌ఐటీ (దుండిగల్‌ హైదరాబాద్‌) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల(సూర్యపేట) 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాల జట్టు కేవలం 6 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 63 పరుగులు సాధించింది.  వినయ్‌  44 పరుగులు చేసి జట్టు విజయాన్ని సునాయాసం చేశాడు. 

జూనియర్స్‌లో కేఎల్‌ఎన్‌ గెలుపు.. 
జూనియర్‌ విభాగంలో మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి.  మొదటి మ్యాచ్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల (మంచిర్యాల), కెఎల్‌ఎన్‌ జూనియర్‌ కళాశాల(మిర్యాలగూడ) తలపడ్డాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ఎస్‌ఆర్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 49 పరుగులు మాత్రమే చేసింది. కెఎల్‌ఎన్‌ కళాశాల జట్టు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసి 7 వికెట్ల నష్టంతో విజయం సొంతం చేసుకుంది.  24 పరుగులు చేసిన శరత్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మెన్, 2 వికెట్లు తీసిన ఫైజ్‌కు బెస్ట్‌ బౌలర్‌ అవార్డు అందుకున్నాడు.  

సత్తాచాటిన గౌతమి కళాశాల...
మొదటి విజయంతో ఉత్సాహంతో రెండో మ్యాచ్‌కు దిగిన కెఎల్‌ఎన్‌ జూనియర్‌ కళాశాలకు గౌతమి జూనియర్‌ కళాశాల(ఈసీఐఎల్‌) చెక్‌ పెట్టింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కెఎల్‌ఎన్‌కు ధీటుగా గౌతమి కళాశాల బ్యాట్స్‌మెన్లు రెచ్చిపోయారు. 7 వికెట్ల నష్టానికి 83 పరుగుల భారీ స్కోర్‌ చేయగా, కెఎల్‌ఎన్‌ జట్టు 8 వికెట్ల నష్టానికి 73 పరుగులు మాత్రమే చేసింది. 11 పరుగుల తేడాతో గౌతమి జూనియర్‌ కళాశాల విజయం సాధించింది. బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా వామన్, బెస్ట్‌ బౌలర్‌గా తునికి సాహిత్‌ ఎంపికయ్యారు.  

నేడు సీనియర్స్‌ ఫైనల్స్‌.. 
తలపడనున్న వాగ్దేవి, ఎంఎల్‌ఆర్‌ఐటీ 
ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌ల చొప్పున తలపడనున్న నేపథ్యంలో బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో విజయం సొంతం చేసుకున్న వాగ్దేవి, ఎంఎల్‌ఆర్‌ఐటీ జట్లు గురువారం ఉదయం ఫైనల్స్‌ బరిలో తలపడనున్నాయి. అదేవిధంగా జూనియర్‌ సెమీఫైనల్, ఫైనల్స్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

                                క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న మర్రి లక్ష్మణ్‌రెడ్డి 

మరిన్ని వార్తలు