ఐపీఎల్‌ 2020: సల్మాన్‌ పాత ట్వీట్‌ వైరల్‌!

27 Oct, 2020 15:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020 సీజన్‌ ఆరంభంలో ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు.. ఆ తర్వాత వరుస విజయాలు సాధించింది. తొలుత మ్యాచ్‌లన్నీ ఓడినా... ఆ తర్వాత గెలుపు బాటపట్టి సత్తా చాటింది. ఇక సోమవారం నాటి మ్యాచ్‌తో ఆరో విజయం ఖాతాలో వేసుకున్న కేఎల్‌ సారథ్యంలోని కింగ్స్‌ జట్టు ‘ప్లే ఆఫ్స్‌’ దారిలో పడింది.  8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించి జయకేతనం ఎగురవేసింది. టాస్‌ నెగ్గి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు తీసి కేకేఆర్‌ను 149 పరుగులకు కట్టడి చేసింది. (చదవండి: ధోని ఫ్యాన్స్‌కు సీఎస్‌కే సీఈవో గుడ్‌న్యూస్‌! )

ఆ తర్వాత ఫోర్‌తో ఛేజింగ్‌ ప్రారంభించిన కింగ్స్‌.. హిట్టర్‌ క్రిస్‌గేల్‌, ఓపెనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ల అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆరంభంలో ఒక్క మ్యాచ్‌ గెలవడానికే ఆపసోపాలు పడ్డ ఈ టీం.. ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచింది. దీంతో పంజాబ్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. మీమ్స్‌తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, 2014లో చేసిన ట్వీట్‌ను మరోసారి తెరమీదకు తెచ్చారు. ‘‘జింటా టీం గెలిచిందా?’’అన్న సల్మాన్‌ వ్యాఖ్యకు బదులుగా.. ‘‘హా అవును. అదే జరిగింది. మీరు చూడలేదా’’ అంటూ వివిధ రకాల మీమ్స్‌ క్రియేట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పంజాబ్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ వసీం జాఫర్‌ తొలుత షేర్‌ చేసిన మీమ్‌కు అభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. కాగా బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా, పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు సహయజమాని అన్న సంగతి తెలిసిందే. ఇక వీలుచిక్కినప్పుడల్లా ఆమె జట్టుతో ఉంటూ, ఆటగాళ్లను ఉత్సాహపరచడం సహా, ఓడిపోయిన సందర్భాల్లో విమర్శలకు ధీటుగా బదులిస్తూ కౌంటర్‌ వేస్తారన్న విషయం తెలిసిందే.(చదవండి: సంజూ గ్రేట్‌.. పంత్‌ నువ్వు హల్వా, పూరీ తిను’)

చదవండి: కేకేఆర్‌పై పంజాబ్‌ ప్రతాపం

మరిన్ని వార్తలు