వాళ్లు అమాయకులంటే అస్సలు నమ్మలేం: పాక్‌ మాజీ కెప్టెన్‌

19 May, 2021 12:27 IST|Sakshi

ఇస్లామాబాద్‌: 2018 నాటి బాల్‌ టాంపరింగ్‌ వివాదం మరోసారి క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది.  దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా బౌలర్‌ బాన్‌క్రాఫ్ట్‌ బంతికి సాండ్‌ పేపర్‌ను రుద్దుతూ కెమెరాల కంటపడ్డ సంగతి తెలిసిందే. దీంతో, అతడితో పాటు అప్పటి కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌పై నిషేధం విధించారు. అది ముగిసిపోయింది కూడా. అయితే, ఇటీవల బాన్‌క్రాఫ్ట్‌ ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. తాను బాల్‌ టాంపరింగ్‌ చేయడం తమ జట్టులోని మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ బాంబు పేల్చాడు. 

దీంతో అప్పటి మ్యాచ్‌లో ప్రధాన బౌలర్లు అయిన పాట్‌ కమిన్స్‌, హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియోన్‌, మిచెల్‌ స్టార్క్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తమకేమీ తెలియదంటూ ఈ నలుగురూ సంయుక్తంగా లేఖ విడుదల చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌... ఆసీస్‌ బౌలర్లు అమాయకులు అంటే తాను అస్సలు నమ్మనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘బాల్‌ రివర్స్‌లో స్వింగ్‌ అవుతుంటే బౌలర్లకు దాని గురించి తెలియదని చెప్పడం అబద్ధమే అవుతుంది. రివర్స్‌ స్వింగ్‌ రాబట్టాలని వారు ముందే నిర్ణయించుకుని ఉంటారు. బంతిని పదే పదే రుద్దుతూ షైన్‌ చేస్తే ఈ విధంగా చేయవచ్చు. 

డ్రెస్సింగ్‌ రూంలో దీని గురించి చర్చ జరుగకుండానే ఇదంతా సాధ్యమైందంటే అస్సలు నమ్మను. నిజానికి బాన్‌క్రాఫ్ట్‌ బంతిని సాండ్‌ పేపర్‌తో రుద్దాడు ఈ విషయం తెలిసి కూడా ఊరుకున్నారు కాబట్టి కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు కూడా శిక్ష పడింది. కానీ ఈ విషయంలో ఇతర బౌలర్లు మాత్రం తప్పించుకున్నారు. అంతా కలిసే చేసినా, కొందరు మాత్రమే శిక్ష అనుభవించారు. బంతి ఎలా తిరుగుతుంది అన్న విషయంపై బౌలర్లకు అవగాహన లేదనడం హాస్యాస్పదమే’’ అని సల్మాన్‌ భట్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఇక్కడితో ముగించండి.. ఆసీస్‌ బౌలర్ల వేడుకోలు
ఇండియాకు వచ్చెయ్‌ ప్లీజ్‌ .. పంత్‌​ స్థానంలో ఆడు

మరిన్ని వార్తలు