సానియా మీర్జా ఖాతాలో 43వ డబుల్స్‌ టైటిల్‌ 

27 Sep, 2021 10:33 IST|Sakshi

ఒస్ట్రావా (చెక్‌ రిపబ్లిక్‌): భారత మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఈ ఏడాది తన ఖాతాలో తొలి డబుల్స్‌ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఒస్ట్రావా ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ)–500 టోర్నీలో చైనా భాగస్వామి ష్వై జాంగ్‌తో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్‌ సానియా–ష్వై జాంగ్‌ ద్వయం 6–2, 6–2తో మూడో సీడ్‌ కైట్లిన్‌ క్రిస్టియన్‌ (అమెరికా)–ఎరిన్‌ రౌట్లిఫ్‌ (న్యూజిలాండ్‌) జంటపై విజయం సాధించింది.

చాంపియన్‌గా నిలిచిన సానియా –ష్వై జాంగ్‌ జోడీకి 25,230 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 62 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  ఈ విజయంతో 34 ఏళ్ల సానియా తన కెరీర్‌లో 43వ డబుల్స్‌ టైటిల్‌ను సాధించింది. చివరిసారి 2020 జనవరిలో హోబర్ట్‌ ఓపెన్‌లో నాదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి టైటిల్‌ నెగ్గిన సానియా ఖాతాలో చేరిన మరో డబుల్స్‌ టైటిల్‌ ఇదే కావడం విశేషం.

చదవండి: IPL 2021 RCB Vs MI:పొట్టి క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన కింగ్‌ కోహ్లి..

మరిన్ని వార్తలు