Sanju Samson: సొంత జట్టు సోషల్‌ మీడియా టీంపై కెప్టెన్‌ ఆగ్రహం

25 Mar, 2022 20:20 IST|Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ తన జట్టుకు చెందిన సోషల్‌ మీడియా టీంపై ఆగ్రహం వక్తం చేశాడు. అతని కోపానికి కారణం వారు చేసిన ట్వీట్‌. విషయంలోకి వెళితే.. సంజూ పాత ఫోటోను తీసుకొని దానికి కూలింగ్‌ గ్లాసెస్‌,  రాజస్తాన్‌ సంప్రదాయ తలపాగాను చుట్టి.. మీరు ఎలా ఉన్నారో చూసుకోండి అంటూ శాంసన్‌కు షేర్‌ చేశారు. అయితే శాంసన్‌ ఈ ఫోటోపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

''మన ఫ్రెండ్స్‌ అయితే ఇలాంటివి చేసినా ఏం అనిపించదు. కానీ ఐపీఎల్‌ లాంటి లీగ్‌లో ఉన్న ఒక జట్టు సోషల్‌ మీడియా టీం ఇలా చేయడం కరెక్ట్‌ కాదు. కాస్త ప్రొఫెషనల్స్‌లా నడుచుకుంటే బాగుంటుంది అని పేర్కొన్నాడు. అంతేకాదు తనపై ట్వీట్‌ పెట్టినందుకు సదరు సోషల్‌ మీడియా టీంపై రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్యానికి శాంసన్‌ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

సంజూ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన యాజమాన్యం సోషల్‌ మీడియా టీంకు హెడ్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎప్పుడు కూల్‌గా కనిపించే శాంసన్‌లో ఇంత ఫైర్‌ దాగుందనేది ఇప్పుడే తెలిసింది. సొంత జట్టైనా సరే తప్పుంది అని తెలిస్తే ఏకిపారేస్తానని శాంసన్‌ చెప్పకనే చెప్పాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు. ఇక మార్చి 26 నుంచి మొదలుకానున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి మ్యాచ్‌ను మార్చి 29న ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడనుంది. 2008లో టైటిల్‌ గెలవడం మినహా రాజస్తాన్‌ మరోసారి అలాంటి ప్రదర్శన చేయలేదు. మరి ఈసారైనా కప్‌ కొడుతుందేమో చూడాలి.

చదవండి: IPL 2022: కత్తి మీద సాము లాంటిది.. ఎలా డీల్‌ చేస్తారో?!

IPL 2022: చహల్‌ చేసిన పనికి షాక్‌ తిన్న క్రికెటర్లు

మరిన్ని వార్తలు