-

PAK Vs NZ: క్రికెట్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసిన మహ్మద్‌ రిజ్వాన్‌.. 

28 Dec, 2022 16:48 IST|Sakshi

పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఐసీసీ రూల్స్‌ బ్రేక్‌ చేశాడు. న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ మధ్య మొదలైన తొలి టెస్టు మూడోరోజు ఆటలో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. జ్వరం కారణంగా బాబర్‌ ఆజం మూడోరోజు మైదానంలోకి రాలేదు. దీంతో బాబర్‌ ఆజం స్థానంలో  స్టాండిన్‌ కెప్టెన్‌గా సీనియర్‌ ప్లేయర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వ్యవహరించాడు. ఇక బాబర్‌ స్థానంలో​ మహ్మద్‌ రిజ్వాన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా అడుగుపెట్టాడు. మ్యాచ్‌లో పలుసార్లు ఆటగాళ్లను ఫీల్డింగ్‌ మారుస్తూ కెప్టెన్‌గా వ్యవహరించడం వివాదానికి దారి తీసింది..

ప్రస్తుతం మహ్మద్‌ రిజ్వాన్‌ టెస్టుల్లో వైస్‌కెప్టెన్‌గా ఉన్నప్పటికి కివీస్‌తో తొలి టెస్టుకు రిజ్వాన్‌ స్థానంలో సీనియర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ జట్టులోకి వచ్చాడు. అతనే వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలతో పాటు స్టాండిన్‌ కెప్టెన్సీ తీసుకున్నాడు. సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా అడుగుపెట్టి కాసేపు స్టాండింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించి రిజ్వాన్‌ చర్య నిబంధనలకు విరుద్ధం.

వాస్తవానికి క్రికెట్‌లో చట్టాలు తెచ్చే ఎంసీసీ(మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌) రూల్స్‌ ఏం చెబతున్నాయంటే.. మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా వచ్చిన ఏ ఆటగాడైనా సరే కెప్టెన్సీ లేదా బౌలింగ్‌ చేయకూడదన్న నిబంధన ఉంది. అయితే అంపైర్‌ అనుమతితో వికెట్‌ కీపింగ్‌ చేసే అవకాశం మాత్రం ఉంటుంది(అదీ అంపైర్‌ అనుమతి ఇస్తేనే). ఇక క్రికెట్‌ పుస్తకాల్లో ఎంసీసీ పేర్కొన్న రూల్‌ 24.1.2 కూడా ఇదే చెబుతుంది. అయితే ఈ నిబంధనను రిజ్వాన్‌తో పాటు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు గాలికొదిలేసినట్లు కనిపించింది.

ఇదే విషయమై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. పీసీబీ కావాలనే నిబంధనను గాలికొదిలేసిందా లేక మరిచిపోయిందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత కాసేపటికే డెవన్‌ కాన్వే రివ్యూ విషయంలో కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. అయితే రివ్యూకు వెళ్లడానికి ముందు రిజ్వాన్‌తో చర్చించి డీఆర్‌ఎస్‌కు అప్పీల్‌ చేయడం కన్ఫూజన్‌కు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ రివ్యూ పాక్‌కు ఫలితం తెచ్చిపెట్టడంతో ఈ విషయం పెద్దగా వెలుగులోకి రాలేదు.

ఇక తొలి టెస్టులో న్యూజిలాండ్‌ పాక్‌ జట్టుకు ధీటుగా బదులిస్తుంది. బాబర్‌ ఆజం, అగా సల్మాన్‌లు సెంచరీలతో చెలరేగడంతో పాకిస్తాన్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ చేస్తున్న న్యూజిలాండ్‌ 4 వికెట్ల నష్టానికి 408 పరుగులతో ఆడుతుంది. కేన్‌ విలియమ్సన్‌ 85 పరుగులతో , టామ్‌ బ్లండెల్‌ 41 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు డెవన్‌ కాన్వే 92 పరుగులు చేసి ఔటయ్యాడు.

చదవండి: ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక

అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు..

మరిన్ని వార్తలు