ఫైనల్లో శాతవాహన జూనియర్‌ కాలేజి

23 Apr, 2021 05:21 IST|Sakshi
వరుసగా రెండు విజయాలు సాధించి ఫైనల్‌ చేరిన శాతవాహన జూనియర్‌ కాలేజి (శ్రీకాకుళం)

తుది అంకానికి సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ

నేడు ఫైనల్‌ మ్యాచ్‌లు

విజయవాడ స్పోర్ట్స్‌: సాక్షి మీడియా గ్రూప్, కేఎల్‌ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ (ఎస్‌పీఎల్‌) రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. విజయవాడలో గురువారం సెంట్రల్‌ ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల జూనియర్, సీనియర్‌ జట్లు తలపడ్డాయి.   

ఉదయ్‌ 4 బంతుల్లో 4 వికెట్లు...
జూనియర్‌ జట్లకు నిర్వహించిన రెండు లీగ్‌ మ్యాచ్‌లలో ఉత్తరాంధ్ర (శాతవాహన జూనియర్‌ కాలేజీ, శ్రీకాకుళం) జట్టు విజయం సాధించి ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. సెంట్రల్‌ ఆంధ్ర (చీరాల పాలిటెక్నిక్‌ కాలేజి, ప్రకాశం) జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర జట్టు నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. ఉత్తరాంధ్ర జట్టు 10 ఓవర్లలో 41 పరుగులు చేసింది. రమణ (12), సుధమ్‌ (19) రాణించగా... 42 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సెంట్రల్‌ ఆంధ్ర జట్టు 37 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. నాలుగు ఓవర్లు ముగిశాక 25/3 స్కోరుతో విజయం దిశగా సాగుతున్న సెంట్రల్‌ ఆంధ్ర జట్టును ఐదో ఓవర్‌లో ఉదయ్‌ దెబ్బ తీశాడు. ఉదయ్‌ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. రాయలసీమ జట్టు (ఎమరాల్డ్‌ జూనియర్‌ కాలేజి)తో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర (శాతవాహన జూనియర్‌ కాలేజి) జట్టు 19 పరుగుల తేడాతో గెలిచింది.

మరిన్ని వార్తలు