‘వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌’కు సాత్విక్‌ జోడీ అర్హత

30 Nov, 2021 05:30 IST|Sakshi

బాలి (ఇండోనేసియా): బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు భారత పురుషుల డబుల్స్‌ స్టార్‌జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి అర్హత సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీకి అర్హత పొందిన తొలి భారత పురుషుల జంటగా నిలిచింది. గతవారం ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 టోర్నీలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం సెమీఫైనల్‌ చేరింది. వీరికి పోటీగా ఉన్న జపాన్‌ జోడీ అకిరా కొగా–తైచి సయితో కూడా సెమీస్‌లోనే ఓడింది. ఆ సెమీస్‌లో తప్పక గెలిస్తేనే క్వాలిఫై కావాల్సి ఉండగా, జపాన్‌ జంట కూడా ఓడిపోవడంతో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయానికి మార్గం సుగమమైంది. బుధవారం బాలిలో మొదలయ్యే ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్, మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప బరిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు