మ్యాక్సీ సిక్సర్‌ దెబ్బకు విరిగిన కుర్చీ వేళానికి..

3 Mar, 2021 20:36 IST|Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ప్రత్యర్థి బౌలర్లపై శివాలెత్తాడు. 31 బంతుల్లో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. కివీస్‌ బౌలర్‌ నీషమ్‌ వేసిన 17వ ఓవర్లో మ్యాక్సీ పరుగుల వరద పారించాడు. ఆ ఓవర్లో వరుసగా 4 6 4 4 4 6 బాది 28 రన్స్‌ను పిండుకున్నాడు. ఈ క్రమంలో మ్యాక్సీ సిక్సర్ల ధాటికి స్టాండ్స్‌లో ఉన్న ఓ సీటు తునాతునకలైంది. సౌథీ వేసిన 18వ ఓవర్‌లోని నాలుగో బంతి జెట్‌ వేగంతో స్టాండ్స్‌లోకి దూసుకెళ్లి అక్కడున్న ఓ సీటును బలంగా తాకింది. బంతి వేగానికి ఆ సీటుకు పెద్ద రంధ్రమే పడింది. స్టాండ్స్‌లో ప్రేక్షకులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయ్యింది. 

మ్యాక్సీ ధాటికి తునాతునకలైన ఆ సీటును ఓ స్వచ్ఛంద సంస్థ కోసం వేలానికి ఉంచనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ అనంతరం మాక్సీ ఆ సీటుపై సంతకం కూడా చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ధాటికి ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌ 17.1 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటై 64  పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 5 టీ20ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన కివీస్‌ మూడో టీ20ని కోల్పోవడంతో ఆధిక్యాన్ని 2-1కి తగ్గించుకుంది.

మరిన్ని వార్తలు