IPL: ధోని వారసుడిగా రుతురాజ్‌ సరైనోడని అంటున్న సెహ్వాగ్

14 May, 2022 12:56 IST|Sakshi
Photo Courtesy: IPL

చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా ధోనికి ఈ సీజన్‌ (2022) ఆఖరుది కావచ్చు. ఈ నేపథ్యంలో ఆ జట్టు భవిష్యత్తు సారధి ఎవరనే చర్చ ప్రస్తుతం ఐపీఎల్‌ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ధోని వారసుడిగా రవీంద్ర జడేజా అద్భుతాలు చేస్తాడని భావించిన సీఎస్‌కే యాజమాన్యం.. వరుస పరాజయాల ఎఫెక్ట్‌తో అతన్ని ఏకంగా జట్టు నుంచే తప్పించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ధోని వారసుడు ఎవరు..? ఈ అంశంపై అభిమానులు, మాజీలు, విశ్లేషకుల మధ్య హాట్‌ డిబేట్‌ నడుస్తుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్ సీఎస్‌కే యాజమాన్యం ముందు ఓ ఆసక్తికర ప్రపోజల్‌ను ఉంచాడు.  

సీఎస్‌కే భావి కెప్టెన్‌గా ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ పేరును ప్రతిపాదించాడు. రుతురాజ్‌లో ధోని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, అవి సీఎస్‌కే పూర్వవైభవం సాధించేందుకు తోడ్పడతాయని అన్నాడు. ధోని తరహాలోనే రుతురాజ్‌ కూడా చాలా కూల్‌గా కనిపిస్తాడని, సెంచరీ చేసినా డకౌటైనా ఒకే రకంగా స్పందిస్తాడని కితాబునిచ్చాడు. రుతురాజ్‌కు మహారాష్ట్ర కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి, అతనికే సీఎస్‌కే పగ్గాలు అప్పజెప్పడం బెటరని అభిప్రాయపడ్డాడు. అదృష్టం మినహా రుతురాజ్‌లో ధోని లక్షణాలన్నీ దాదాపుగా కవర్‌ అయ్యాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక, ఈ సీజన్‌లో గైక్వాడ్ ఫామ్‌లో లేకపోవడం కూడా చెన్నై విజయావకాశాలను దారుణంగా  దెబ్బతీసిందని పేర్కొన్నాడు. 
చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. అత్యంత అరుదైన ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా..!

మరిన్ని వార్తలు