Jhulan Goswami: బెంగాల్‌ క్రికెట్‌లో టీమిండియా సీనియర్‌ పేసర్‌కు కీలక పదవి

29 Jul, 2022 13:56 IST|Sakshi

టీమిండియా సీనియర్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామి బెంగాల్‌ క్రికెట్‌లో కొత్త పదవి చేపట్టనుంది. బెంగాల్‌ మహిళల జట్టు ఆటగాళ్లకు మెంటార్‌ కమ్‌ ప్లేయర్‌గా వ్యవహరించనున్నట్లు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) పేర్కొంది. టీమిండియా సీనియర్‌ పేసర్‌గా సేవలందిస్తున్న ఝులన్‌ గోస్వామి బెంగాల్‌ వుమెన్స్‌ టీమ్‌లో అన్ని ఫార్మాట్లకు మెంటార్‌గా వ్యవహరిస్తుందని క్యాబ్‌ అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియా పేర్కొన్నారు.

గురువారం సాయంత్రం​జరిగిన అధ్యక్షత సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.ఇక అండర్‌-16 కోచ్‌గా అరిన్‌దామ్‌ దాస్‌ బాధ్యతలు చేపట్టనున్నాడని.. అతనికి అసిస్టెంట్‌ కోచ్‌ ఎవరనేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. కాగా అండర్‌-25 కోచ్‌గా ఉన్న ప్రణబ్‌ రాయ్‌కు పార్థసారథి భట్టాచార్య అసిస్టెంట్‌గా వ్యవహరిస్తాడని స్పష్టం చేశాడు. ఇక అండర్‌-19 కోచ్‌గా ఉన్న దెవాంగ్‌ గాంధీకి సంజీబ్‌ సన్యాల్‌ అసిస్టెంట్‌గా ఉండనున్నాడు.

39 ఏళ్ల ఝులన్‌ గోస్వామి 2018లో టి20 క్రికెట్‌ నుంచి తప్పుకొని కేవలం వన్డేలకు పరిమితమైంది. మహిళా క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌లో 200, 250 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా ఝులన్‌ గోస్వామి చరిత్ర సృష్టించింది.  2007లో ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైన ఝులన్‌ గోస్వామి 2008 నుంచి 2011 వరకు టీమిండియా మహిళా జట్టుకు నాయకత్వం వహించింది. ఇక ఝులన్‌ గోస్వామి టీమిండియా తరపున 12 టెస్టుల్లో 291 పరుగులు.. 44 వికెట్లు, 199 వన్డేల్లో 1226 పరుగులు.. 250 వికెట్లు.. 68 టి20ల్లో 405 పరుగులు.. 56 వికెట్లు పడగొట్టింది.

చదవండి: Washington Sundar: సుందర్‌ 'నమ్మశక్యం కాని బౌలింగ్‌'.. నోరెళ్లబెట్టిన ప్రత్యర్థి బ్యాటర్

మరిన్ని వార్తలు