ఆ విలువైన వికెట్‌పైనే నా ఫోకస్‌: రవిబిష్నోయ్‌

25 Sep, 2020 17:57 IST|Sakshi

షార్జా:  భారత అండర్‌-19 జట్టులో రాణించి ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన కింగ్స్‌ పంజాబ్‌ స్పిన్నర్‌ రవిబిష్నోయ్‌.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే నాలుగు వికెట్లతో మెరిశాడు. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో అరోన్‌ ఫించ్‌ను బౌల్డ్‌ను చేసిన బిష్నోయ్‌.. ఆపై వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌లను కూడా ఔట్‌  చేశాడు. దాంతో ఆత్మవిశ్వాసం పెరిగిన బిష్నోయ్‌.. ఇప్పుడు ఒక స్టార్‌ బ్యాట్స్‌మన్‌పై ఫోకస్‌ చేశాడట. ఆదివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై దృష్టిపెట్టాడట. (చదవండి: ఈ ఏడాది మరీ ఇంత దారుణమా: అశ్విన్‌)

స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనే స్మిత్‌ను ఔట్‌ చేయడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నాడు.  ప్రస్తుతం ఆ విలువైన వికెట్‌ను సాధించడం కోసం ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు తన టార్గెట్‌ను చెప్పిన ఈ వీడియోను ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో షేర్‌ చేశారు.  ప్రతీ ఒక్క యువ క్రికెటర్‌కు ఐపీఎల్‌ ఆడాలనేది కలగా ఉంటుందని, తనకు కూడా అలానే ఉండేదన్నాడు. ఇప్పుడు ఐపీఎల్‌ ఆడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఒక క్రికెటర్‌ వెలుగులోకి రావడానికి ఇదొక పెద్ద వేదికని, తనలాంటి వాళ్లకు ఇది సువర్ణావకాశమన్నాడు. తాను ఐపీఎల్‌ను టీవీలో చూస్తూ ఎంజాయ్‌ చేసేవాడినని, ఇప్పుడు తాను  ఆడటం నిజంగా అదృష్టమన్నాడు. 

మరిన్ని వార్తలు