యూఏఈ టీ20 లీగ్‌.. మరో ఫ్రాంచైజీని దక్కించుకున్న షారుక్‌ ఖాన్‌

12 May, 2022 18:50 IST|Sakshi

Abu Dhabi Knight Riders: ఐపీఎల్ స్పూర్తితో యూఏఈ వేదికగా మరో టీ20 లీగ్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని,  బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఈ లీగ్‌లోనూ ఓ కీలక ఫ్రాంచైజీని దక్కించుకున్నాడు. కొత్త ఫ్రాంచైజీకి అబుదాబి నైట్ రైడర్స్ అనే పేరును ఖరారు చేసింది కేకేఆర్‌ యాజమాన్యం. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా అధికారికంగా వెల్లడించింది. 


షారుక్‌- జూహి చావ్లా భాగస్వాములుగా ఏర్పడిన సైట్‌ రైడర్స్‌ గ్రూప్‌ 2008 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేసింది. ఆతర్వాత 2015లో విండీస్‌ వేదికగా జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్‌)లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ (టీకేఆర్) ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. తాజాగా యూఏఈ టీ20 లీగ్‌లో అబుదాబి నైట్ రైడర్స్ (ఏడీకేర్‌)ను హస్తగతం చేసుకుంది. షారుక్‌ నేతృత్వంలోని నైట్‌రైడర్స్‌ గ్రూప్‌ త్వరలో యూఎస్‌ఏ వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్‌లోనూ ఓ ఫ్రాంచైజీని (లాస్ ఏంజెల్స్)  సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతుంది.   

ఇటీవలే ఎంఎల్సీ (మేజర్ లీగ్ క్రికెట్)తో ఒప్పందం​ కుదుర్చుకున్న నైట్‌రైడర్స్‌ గ్రూప్‌.. లాస్ ఏంజెల్స్‌కు 40 మైళ్ల దూరంలో ఉన్న సౌత్ కాలిఫోర్నియాలో గల ఐర్విన్ నగరంలో పదివేల సీటింగ్ కెపాసిటీతో దాదాపు 30 మిలియన్ల యూఎస్ డాలర్ల ఖర్చుతో ఓ భారీ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు కేఆర్జీ (నైట్ రైడర్స్ గ్రూప్), ఎంఎల్సీల మధ్య అవగాహన కూడా కుదరినట్లు సమాచారం. కాగా, యూఏఈ లీగ్‌లో కేకేఆర్‌తో పాటు మరో ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్ కూడా ఓ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది.
చదవండి: ఐపీఎల్‌ ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు.. సందడి చేయనున్న ఆస్కార్‌ విన్నర్‌

మరిన్ని వార్తలు