కళ్లు చెదిరే రనౌట్‌ అంటే ఇదే..

15 Aug, 2020 12:25 IST|Sakshi

సౌతాంప్టన్‌ : టెస్టు క్రికెట్‌లో రనౌట్‌ అనే పదమే చాలా తక్కువగా వినిపిస్తుంది. కానీ అనిశ్చితికి మారుపేరుగా ఉండే పాకిస్తాన్‌ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి అర్థం కాదు.. జట్టులోని ఆటగాళ్లు కూడా అంతే.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌లో షాహిన్‌ ఆఫ్రిది రనౌటైన తీరు చూస్తే జాలేస్తుంది. షాహిన్‌ తనంతట తానే రనౌట్‌ కావడం హాస్యాప్పదంగా ఉందంటూ ట్విటర్‌లో అభిమానులు పేర్కొంటున్నారు. (సచిన్‌ మొదటి సెంచరీకి 30 ఏళ్లు)

సౌతాంప్టన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌ ఆడుతున్న పాక్‌ జట్టు 75 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.  క్రీజులో మహ్మద్‌ రిజ్వాన్‌, షాహిన్‌ ఆఫ్రిది ఉన్నారు. క్రిస్‌ వోక్స్‌ వేసిన బంతి రిజ్వాన్‌ లెగ్‌ను తాకుతూ బయటికి వెళ్లింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అప్పీల్‌ కోసం అంపైర్‌ను అడుగుతున్నారు. అయితే స్ట్రైకింగ్‌లో ఉన్న రిజ్వాన్‌ కాల్‌ వినిపించుకోకుండానే షాహిన్‌ పరుగు కోసం సగం క్రీజు వదిలి వచ్చాడు. ఇంతలో బంతిని అందుకున్న డొమినిక్‌ సిబ్లే కళ్లు చెదిరే వేగంతో వేసిన డైరెక్ట్‌ త్రో నేరుగా వికెట్లను గిరాటేసింది. అసలు ఇలా ఉదారంగా వికెట్‌ వస్తుందని ఇంగ్లండ్‌ కూడా ఊహించి ఉండదు.

అనవసరంగా ఒక డాట్‌ బాల్‌కు అవుటయ్యాననే ఫీలింగ్‌ కలిగిందేమో.. షాహిన్‌ ముఖానికి చేతిని అడ్డుపెట్టుకొని డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం షాహిన్‌ రనౌట్‌ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని ఈసీబీ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. డొమినిక్‌ సిబ్లే అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాన్ని చూడండి అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కాగా  మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మొదటి టెస్టు మ్యాచ్‌ను ఆతిధ్య ఇంగ్లండ్‌కు సమర్పించుకున్న పాక్‌ రెండో టెస్టును నిరాశజనంకగానే ప్రారంభించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. మహ్మద్‌ రిజ్వాన్‌ 60*, నసీమ్‌ షా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్‌ 3, స్టువర్ట్‌ బ్రాడ్‌ 3, సామ్‌ కరన్‌, వోక్స్‌ తలా ఒక వికెట్‌ తీశారు.(ఎక్కడైనా ధోనియే నెంబర్‌ వన్‌)

మరిన్ని వార్తలు