Shahid Afridi: పీసీబీ చీఫ్‌ సెలెక్టర్‌గా అఫ్రిది మంగమ్మ శపథం

1 Jan, 2023 13:54 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఇటీవలే షాహిద్‌ అఫ్రిదిని చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అఫ్రిదితో పాటు మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్, మాజీ పేసర్ ఇఫ్తికార్ అంజుమ్, హరూన్ రషీద్ లతో కూడిన సెలక్షన్ కమిటీ త్వరలో ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో షాహిద్‌ అఫ్రిది తాను చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపికవ్వడంపై తొలిసారి పెదవి విప్పాడు. తాను పదవి నుంచి దిగిపోయేలోపు పాకిస్తాన్ క్రికెట్ లో రెండు పటిష్టమైన జట్లను తయారుచేస్తానని.. ఆ విషయంలో రాజీ పడేది లేదని చెప్పాడు. 

ఈ  మేరకు శనివారం  విలేకరులతో మాట్లాడుతూ.. ''చీఫ్ సెలక్టర్ గా నా పదవీ కాలం ముగిసేలోపు  పాక్ క్రికెట్ టీమ్ బెంచ్ ను బలోపేతం చేస్తా. నేను  పాకిస్తాన్ కోసం ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉండేలా రెండు జట్లను తయారుచేస్తా'' అంటూ మంగమ్మ​ శపథం చేశాడు . అయితే అఫ్రిది వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానులు భిన్నంగా స్పందించారు.

ప్రధాన జట్టుకు సమాంతరంగా  మరో జట్టును తయారుచేయడం పాకిస్తాన్ కు  కొత్తగా అనిపిస్తున్నప్పటికీ ప్రపంచ క్రికెట్ లో అది పాత చింతకాయ పచ్చడిలానే ఉంది. ఇంగ్లండ్‌ (ఈసీబీ), ఇండియా (బీసీసీఐ) ఇవి  కొద్దికాలంగా అమలుపరుస్తున్న  విధానాలే.ఏకకాలంలో ఆ జట్లు  రెండు దేశాలతో ఆడేంత సామర్థ్యం సాధించుకున్నాయి. 

షాహిన్‌ అఫ్రిది గాయంతో తప్పుకోవడంతో ఆ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో  షాహిన్ తో పాటు ఆ జట్టు ప్రధాన పేసర్లు హరీస్ రౌఫ్, నసీమ్ షాలు కూడా చివరి రెండు టెస్టులకు దూరమయ్యారు. దీంతో  అంతగా అనుభవం లేని  బౌలర్లతో  పాకిస్తాన్ బరిలోకి దిగి సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది.  మరి ఈ ప్రయత్నంలో అఫ్రిది ఏ మేరకు విజయవంతమవుతాడనేది వేచి చూడాల్సిందే.

చదవండి: పంత్‌ను కాపాడిన బస్సు డ్రైవర్‌కు సత్కారం.. ఎప్పుడంటే?

ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్‌ శర్మ భార్య ఆగ్రహం

మరిన్ని వార్తలు