T20 WC 2022: మళ్లీ మాది పాత కథే.. వర్షం రాక పోయుంటే విజయం మాదే: షకీబ్‌

3 Nov, 2022 07:33 IST|Sakshi

అఖరి వరకు ఉ‍త్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై  5 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు మరింత చేరువైంది. ఇక కీలక మ్యాచ్‌లో ఓటమిపాలైన బంగ్లాదేశ్‌ తమ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఓ దశలో బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్ల కంటే ముందే లక్ష్యాన్ని చేధించేట్లు కనిపించింది. అయితే బంగ్లా జోరుకు 7 ఓవర్ల వద్ద వరుణుడు బ్రేక్‌ వేశాడు. అనంతరం మ్యాచ్‌ మళ్లీ తిరిగి ప్రారంభమయ్యాక బౌలర్లు చెలరేగడంతో అఖరికి విజయం టీమిండియాను వరించింది. ఇక ఓటమిపై మ్యాచ్‌ అనంతరం బం‍గ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్ స్పందించాడు.

షకీబ్‌ మాట్లాడూతూ.. "భారత్‌తో మళ్లీ మాది పాత కథే. గెలుపునకు బాగా దగ్గరగా రావడం, ఆపై ఓడిపోవడం. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌లు మేం ఎక్కువగా ఆడలేదు. అందుకే అలాంటి సమయంలో ఎలా గెలవాలో తెలీదు. అనుభవం లేకపోవడం కూడా ఒక కారణం. 185 అయినా 151 అయినా సాధించదగ్గ లక్ష్యమే. కానీ దురదృష్టవశాత్తూ మేం గెలవలేకపోయాం. చివరి 2 ఓవర్లలో 30 కూడా సాధ్యమే కానీ అది జరగలేదు.

వాన ఆగిన తర్వాత మైదానం తడిగా ఉంది. కాబట్టి కాస్త ఆలస్యంగా ఆటను ప్రారంభించమని అంపైర్లను అడిగే స్థాయి నాకు లేదు. వర్షంతో మా జోరుకు అడ్డుకట్ట పడిందనేది వాస్తవం. అయితే సాధారణంగా మైదానం, బంతి తడిగా ఉన్నప్పుడు బౌలింగ్‌ జట్టుకే సమస్య. బ్యాటింగ్‌లో పరుగులు చేయడం సులువే కాబట్టి దానిని ఓటమికి సాకుగా చెప్పను" అని పేర్కొన్నాడు.
చదవండి: Rohit Sharma: 'మ్యాచ్‌ హీరో అర్ష్‌దీప్‌.. బుమ్రా లోటును తీరుస్తున్నాడు'

మరిన్ని వార్తలు