ఆ క్రికెటర్‌ను బూతులు తిట్టారు.. నెలల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు..!

15 May, 2022 13:29 IST|Sakshi

క్రికెట్‌ ఆస్ట్రేలియా రెండు నెలల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ క్రికెటర్లను కోల్పోయింది. ఇదే ఏడాది మార్చి 4న షేన్‌ వార్న్‌ (52) గుండెపోటుతో మరణించగా.. తాజాగా (మే 14) ఆండ్రూ సైమండ్స్(46) కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఇద్దరూ ఈ శతాబ్దపు ఆరంభంలో ఆస్ట్రేలియాను తిరుగులేని జట్టుగా నిలబెట్టారు. ఆటలోనే కాకుండా వివాదాల విషయంలో ఈ ఇద్దరూ క్రికెట్‌ ఆస్ట్రేలియాకు పోటీ పడి మరీ అపవాదు తెచ్చారు. సైమండ్స్‌ అకాల మరణ వార్త తెలియగానే వీరిద్దరికి సంబంధించిన ఓ పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. 

2021 భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్ట్‌ సందర్భంగా వార్న్‌, సైమోలిద్దరూ మోడ్రన్ స్మిత్‌గా పిలువబడే ఆసీస్‌ క్రికెటర్‌ మార్నస్ లబుషేన్‌పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ మ్యాచ్‌కు కామెంటేటర్లు వ్యవహారించిన వార్న్, సైమండ్స్‌లు లబుషేన్‌ను బండ బూతులు తిడుతూ అడ్డంగా దొరికిపోయారు. లబూషేన్‌ విషయంలో వారి సంభాషణను ఫాక్స్‌ స్పోర్ట్స్‌ లైవ్‌లో ప్రసారం చేయడంతో విషయం బయటపడింది. 

సిడ్నీ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ 91 పరుగుల వద్ద ఔట్‌ కావడంతో తొలుత వార్న్‌ లబూషేన్‌ను విమర్శించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సైమండ్స్‌ అందుకుని.. లబుషేన్‌కి అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ ఉంది. దాన్ని తగ్గించడానికి ఏదైనా మందులు (హాగ్‌ పైల్‌) ఇవ్వాలంటూ బూతు పురాణం మొదలుపెట్టాడు. దీన్ని వార్న్ కొనసాగించాడు. 

ఈ తతంగం మొత్తం ప్రత్యక్ష ప్రసారం కావడంతో వార్న్‌-సైమోలిద్దరూ మరోసారి విమర్శలపాలయ్యారు. కాగా, రెండు నెలల వ్యవధిలో వార్న్‌-సైమోలిద్దరు హఠాణ్మరణం చెందడంతో లబూషేన్‌ విషయం నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ యువ క్రికెటర్‌ను అనరాని మాటలు అన్నారు.. అనుభవించారు అంటూ కొందరు ఆకతాయిలు పోస్ట్‌లు పెడుతున్నారు.
చదవండి: ఆండ్రూ సైమండ్స్‌ గొప్ప ఆల్‌రౌండర్‌.. కానీ ఆ వివాదాల వల్లే..

>
మరిన్ని వార్తలు