'అంతా బాగుంది.. నోబాల్స్‌ జీర్ణించుకోలేకపోతున్నా' 

18 Jan, 2021 17:14 IST|Sakshi

బ్రిస్బేన్‌: ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన టి.నటరాజన్‌ తొలి సిరీస్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శనతో అదరగొట్టాడు.మూడు మ్యాచ్‌లు కలిపి 6.92 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీశాడు.ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌లో మాత్రం నటరాజన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే టీమిండియా ప్రధాన బౌలర్లంతా గాయపడడంతో బ్రిస్బేన్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు ద్వారా నటరాజన్‌ టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లు తీశాడు... కానీ నటరాజన్‌ విషయంలో నో బాల్స్‌ అంశం మాత్రం బాగా కలవరపెడుతుంది. మంచి ఫుట్‌వర్క్‌ కలిగిన నటరాజన్‌ ఆడిన తొలి టెస్టులోనే  ఏడు నోబాల్స్‌ వేయడం విశేషం. టెస్టు మ్యాచ్‌లో నోబాల్స్‌ పడడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఇదే అంశంపై ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ స్పందించాడు.

'నటరాజన్‌ బౌలింగ్‌ శైలి అద్భుతంగా ఉంది.. అతను వికెట్‌ తీసే విధానం కూడా చాలా బాగుంది. కానీ నో బాల్స్‌ విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నా. టెస్టుల్లో నో బాల్స్‌ వేయడం అరుదు.. అలాంటిది నటరాజన్‌ మాత్రం ఏడు నోబాల్స్‌ వేశాడు. దీంతోపాటు ఒక ఓవర్‌ ప్రారంభంలోనే మొదటి బంతి సరిగా వేయడానికి ఐదు నో బాల్స్‌ వేయడం కాస్త ఆశ్యర్యం వేసింది. ఆ సమయంలో నటరాజన్‌కు ఆ బంతులు జీర్ణించుకోవడం కాస్త కష్టంగా మారి ఉంటుంది.' అని తెలిపాడు. (చదవండి: ఆసీస్‌ క్రికెటర్‌పై షేన్‌ వార్న్‌ అసభ్యకర వ్యాఖ్యలు)

 కాగా గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 294 పరుగులకు ఆలౌట్‌ అయింది. తొలి ఇన్నింగ్స్‌ ఆదిక్యం 33 పరుగులతో కలిపి ఓవరాల్‌గా టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్‌ శర్మ (4), శుభ్‌మన​ గిల్‌ (0) క్రీజులో ఉన్నారు. ఇక ఇప్పటివరకు మూడు టెస్టులు జరగ్గా.. చెరో విజయంతో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఒక టెస్టు డ్రాగా అయింది. దాంతో తాజా టెస్టు విజయం నిర్ణయాత్మకంగా మారింది.(చదవండి: రోహిత్‌ కావాలనే అలా చేశాడా!)


 

మరిన్ని వార్తలు