'క్రికెట్‌లో ఇలాంటి సూపర్‌స్టార్‌ చాలా అవసరం'

9 Dec, 2020 11:20 IST|Sakshi

సిడ్నీ : టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు కూడా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ అభిప్రాయపడ్డాడు. వాస్తవానికి ఆసీస్‌ టూర్‌కు సంబంధించి బీసీసీఐ ఎంపిక చేసిన టెస్టు జట్టులో హార్ధిక్‌కు చోటు లభించలేదు. దీంతో పాండ్యా స్వదేశానికి వెళ్లి కుటుంబంతో సరదాగా గడపనున్నాడు. ఇదే విషయమై వార్న్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. (చదవండి : నేను అసలు ఊహించలేదు: హార్దిక్‌)

'హార్దిక్‌ పాండ్యాను టెస్టు జట్టుకి కూడా ఎంపిక చేయల్సింది. అతను ఉన్న చోట మంచి ఎనర్జీతో పాటు మిగిలిన ఆటగాళ్లకు తన చేష్టలతో మంచి బూస్ట్‌ అందిస్తాడు. ఇలాంటి సూపర్‌ స్టార్‌.. పరిణితి గల ఆటగాడు క్రికెట్‌కు చాలా అవసరం. పరిమిత ఓవర్లలో నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చకున్న పాండ్యా టీమిండియాకు బ్యాటింగ్‌లోనూ కీలకంగా మారుతున్నాడు. అందుకు ఆసీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లే నిదర్శనం. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కలిపి భారత్‌ తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచిన పాండ్యా టీ20 సిరీస్‌లోనూ రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఒకవేళ హార్దిక్‌ను టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసి ఉంటే కచ్చితంగా తనదైన ముద్ర వేసేవాడు.'అని చెప్పుకొచ్చాడు.

పాండ్యా విషయమై గత ఆదివారం టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ కూడా టెస్టు జట్టులో అతను ఉంటే ఆ మజా వేరుగా ఉండేదని తెలిపాడు. కాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ నుంచి మంచి ఫామ్‌ కనబరుస్తున్న పాండ్యా ఆసీస్‌ టూర్‌లోనూ అదే స్థాయి ప్రదర్శన నమోదు చేశాడు. వన్డే సిరీస్‌లో 210 పరుగులు.. టీ20 సిరీస్‌లో 78 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఆతిథ్య జట్టుకు 2-1 తేడాతో కోల్పోగా.. టీ20 సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో గెలిచి లెక్క సరిచేసింది. ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి డే నైట్‌ టెస్టు మ్యాచ్‌ అడిలైడ్‌ వేదికగా డిసెంబర్‌ 17 నుంచి జరగనుంది. (చదవండి : బెన్‌ స్టోక్స్‌ ఇంట తీవ్ర విషాదం)

>
మరిన్ని వార్తలు