క్రికెట్‌ ఆస్ట్రేలియాపై షేన్‌ వార్న్ అసంతృప్తి

2 Dec, 2020 15:55 IST|Sakshi

సిడ్నీ :  ఆసీస్ స్పిన్‌ దిగ్గజం.. మాజీ బౌలర్‌ షేన్‌ వార్న్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియాపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాన్‌బెర్రా వేదికగా నేడు జరుగుతున్న మూడో వన్డేకు కమిన్స్‌ను పక్కనపెట్టడంపై తప్పుబట్టాడు. వాస్తవానికి  ఐపీఎల్‌ 13 వ సీజన్‌ తర్వాత ఆసీస్‌ ఆటగాళ్లు నేరుగా టీమిండియాతో వన్డే సిరీస్‌ ఆడాల్సి వచ్చింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. దీంతో రానున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని ఆసీస్‌ ప్రధాన బౌలర్‌గా ఉన్న కమిన్స్‌కు మూడో వన్డే నుంచి విశ్రాంతి కల్పించారు. సుదీర్ఘమైన ఐపీఎల్‌ ఆడడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. (చదవండి : 21 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు)

అయితే షేన్‌ వార్న్ ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ కామెంట్స్‌ చేశాడు. 'పాట్‌ కమిన్స్‌కు విశ్రాంతినివ్వడంపై నేను నిరాశకు లోనయ్యా. ఐపీఎల్‌ ఆడినంత మాత్రానా ఆటగాళ్లకు రెస్ట్‌ ఇస్తారా? ఇలా అయితే ఆటగాళ్లను ఐపీఎల్‌కు పంపించాల్సింది కాదు.. ఏ లీగ్‌ ఆడినా ఆటగాళ్లకు దేశం తరపున ఆడడమే మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. అలసిపోయారనే భావనతో కమిన్స్‌ లాంటి ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం సరికాదు. ఐపీఎల్‌ అనేది ఒక లీగ్‌.. ఏడాదికి ఇలాంటి లీగ్‌లు ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఆడుతున్నది అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌. మూడో వన్డేలో కమిన్స్‌ ఆడిస్తే బాగుండేది. క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయం నాకు నచ్చలేదు' అని షేన్‌ వార్న్ చెప్పుకొచ్చాడు.

కాగా ఆసీస్‌ స్టార్‌ బౌలర్‌గా పేరు పొందిన కమిన్స్‌ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. రూ.16 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యానికి నిరాశనే మిగిల్చాడు. 14 మ్యాచ్‌లాడిన కమిన్స్‌ 7.86 ఎకానమి రేటుతో 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

మరిన్ని వార్తలు