రిపోర్టుకు ముందే కరోనా అని తేల్చేసిన కేకేఆర్ ఆటగాడి భార్య

25 May, 2021 19:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ సందర్బంగా కరోనా బారిన పడి, ఇటీవలే కోలుకున్న కేకేఆర్ ఆటగాడు సందీప్ వారియర్..  ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మే 2న అతని భార్యతో వీడియో కాల్ మాట్లాడుతుండగా.. ఆమె అతనికి  కరోనా సోకిందని చెప్పినట్లు తెలిపాడు. భార్య ఆర్తి కరోనా రోగులకు చికిత్స అందించే డాక్టర్ కావడంతో.. ఆమె ఈ విషయాన్ని చూపులతో పసికట్టిందని, అంతే కాకుండా ఆమె కూడా గతేడాది కరోనా బారిన పడిందని  సందీప్ చెప్పుకొచ్చాడు. 

కరోనా బారిన పడినప్పుడు  ఆమెకున్న లక్షణాలే తనకున్నాయని చెప్పడంతో, టెస్టు రిపోర్ట్ రాకముందే తనకు కరోనాగా నిర్దారించిందని గుర్తు చేసుకున్నాడు. కాగా, సందీప్ వారియర్.. అంతకు ముందే ఓ సారి కరోనా టెస్ట్ చేయించాడు. దీంట్లో అతనికి  నెగిటివ్ వచ్చింది. అయితే  ఆతర్వాత అతని భార్య సలహా మేరకు రెండో సారి టెస్ట్ చేయించగా  పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. నాటి నుంచి దాదాపు నాలుగు వారాలు మహమ్మారితో పోరాడిన సందీప్..  ఇటీవలే కోలుకొని, పాత విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. 

ఇదిలా ఉంటే, సందీప్తో పాటు మరో కోల్కతా ఆటగాడు వరుణ్ చక్రవర్తి కూడా కరోనా బారిన పడి కొద్ది రోజుల క్రితమే కోలుకున్నాడు. కాగా, ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ అర్దాంతరంగా ముగిసింది. ఈ సీజన్లో కోల్ కతా 7 మ్యాచ్‌లు ఆడగా 2 విజయాలు, 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.
చదవండి: సచిన్.. నన్ను ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడు: భార్య అంజలీ
 

మరిన్ని వార్తలు