IND Vs WI ODI: విండీస్‌పై విజయం.. టీమిండియా సెలబ్రేషన్స్‌ అదుర్స్‌! వీడియో వైరల్‌

25 Jul, 2022 11:30 IST|Sakshi

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో ధావన్‌ సారథ్యంలోని టీమిండియా కైవసం చేసుకుంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో విండీస్‌పై భారత్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు.

ఇక మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రేజీ సెలబ్రేషన్స్‌కు సైతం ధావన్ నాయకత్వం వహించాడు మరి!.. ఇందుకు సంబంధించిన వీడియోను ధావన్‌ సోషల్‌ మీడియాలో ఖాతాలో షేర్‌ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది.

భారత బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌(63), అక్షర్‌ పటేల్(64‌), సంజూ శాంసన్‌(54) పరుగులతో రాణించారు. విండీస్‌ బౌలర్లలో జోసఫ్‌, మైర్స్‌ చెరో రెండు వికెట్లు, సీల్స్‌, హొసేన్‌, రొమారియో షెపర్డ్ తలా వికెట్‌ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓపెనర్‌ షై హోప్‌(115) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (77 బంతుల్లో 74; 1 ఫోర్, 6 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు తీశాడు. 

ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ రెండో వన్డే
వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
టాస్‌: విండీస్‌- బ్యాటింగ్‌
వెస్టిండీస్‌ స్కోరు: 311/6 (50 ఓవర్లు)
సెంచరీతో చెలరేగిన షై హోప్‌(115 పరుగులు)
భారత్‌ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు)
విజేత: భారత్‌.. 2 వికెట్ల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అక్షర్‌ పటేల్‌ ‌(64 పరుగులు, ఒక్క వికెట్‌)
అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌(63), అక్షర్‌ పటేల్(64‌), సంజూ శాంసన్‌(54)
చదవండి: Shikhar Dhawan: ఆ ముగ్గురు అద్భుతం చేశారు.. అలాంటి పొరపాట్లు సహజం.. ఆవేశ్‌ సైతం!

మరిన్ని వార్తలు