టీమిండియా కెప్టెన్‌గా శిఖర్‌ ధవన్‌ పేరు ఖరారు..?

9 Jun, 2021 17:40 IST|Sakshi

ముంబై: మెన్‌ ఇన్‌ బ్లూకు ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించే గొప్ప అవకాశం టీమిండియా గబ్బర్‌.. శిఖర్‌ ధవన్‌కు త్వరలో దక్కనుంది. ఇప్పటి వరకు కొన్ని మ్యాచ్‌ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన గబ్బర్‌కి.. కెరీర్‌లో తొలిసారి భారత జట్టుకు నాయకత్వం వహించే అద్భుత అవకాశం దక్కబోతోంది. వచ్చే నెలలో శ్రీలంకతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ నిమిత్తం ధవన్‌ను భారత జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే, కోహ్లీ నేతృత్వంలోని భారత రెగ్యులర్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుండగా, మరో భారత జట్టు శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. లంక పర్యటనకు లిమిటెడ్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌లతో కూడిన భారత బి జట్టుని సెలెక్టర్లు అతి త్వరలో ఎంపిక చేయనున్నారు. ఇందులో శిఖర్ ధవన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, రాహుల్ తెవాటియా తదితరులు ఉండే అవకాశం ఉంది.

కాగా, జులై 13న భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే జరుగనుండగా..జూన్‌ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే‌ జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ నిమిత్తం భారత చీఫ్ కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించబోతున్నాడు. మ్యాచ్‌లన్నీ కొలంబో వేదికగా జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు ఈ నెల 18 నుంచి 22 వరకు భారత రెగ్యులర్‌ జట్టు డబ్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుండగా, అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. 
చదవండి: ICC RANKINGS: రెండో ర్యాంక్‌కు దూసుకొచ్చిన టీమిండియా ఆల్‌రౌండర్‌

మరిన్ని వార్తలు