గొప్ప గౌరవంగా భావిస్తున్నాను: శిఖర్‌ ధవన్‌

12 Jun, 2021 18:19 IST|Sakshi

ముంబై: జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత-బి జట్టుకు కెప్టెన్‌గా బీసీసీఐ శిఖర్‌ ధవన్‌ను నియమించింది. తన కెరీర్‌లో తొలిసారి ధవన్‌ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించినున్నాడు. శ్రీలంక పర్యటన కోసం 20 మంది సభ్యుల బృందాన్ని బీసీసీఐ గురువారం ప్రకటించింది. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జూన్ 18 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఇంగ్లండ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో బీసీసీఐ లంక టూర్‌కు వెళ్లే సీనియర్‌ జట్టుకు శిఖర్‌ ధవన్‌ను కెప్టెన్‌గా నియమించింది.

దీనిపై శిఖర్‌ ధవన్‌ స్పందిస్తూ.. ‘‘భారత జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరి అభినందనలకు ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్‌ చేశాడు. జూలై 13 నుంచి 25 వరకు టీమిండియా మూడు వన్డేలు(జూలై 13, 16, 18) ఆడనుండగా.. మూడు టీ20లు(జూలై 21,23,25) ఆడనుంది. ఈ పర్యటనకు భారత మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా.. సీమర్ భువనేశ్వర్ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. రుతురాజ్ గైక్వాడ్, నితీష్ రానా, దేవదత్ పాడికల్, కే గౌతం, చేతన్ సకారియా జాతీయ జట్టులో స్థానం సంపాదించారు.

శిఖర్‌ ధవన్‌ అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే ప్రథమ. గతంలో గబ్బర్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ధవన్‌ 10 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. నాలుగు గెలిచారు. ధవన్‌ను కెప్టెన్సీకి బాధ్యతలు అప్పగించడం పట్ల ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: నట్టూ, శ్రేయస్‌లను ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా..

మరిన్ని వార్తలు